పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కులో రాజ్యాంగ నిర్మాతలు పత్రికా స్వేచ్ఛనూ చేర్చారు. అయితే ప్రత్యేకంగా, వ్యవస్థాపరంగా సమాచార సాధనాలపై మొదటినుంచీ కొంత నియంత్రణ అనేది ఉంటూ వస్తున్నది. ఉదాహరణకు పత్రికలకు సంబంధించి ఏర్పాటుచేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.
దానికో చైర్మన్ బాధ్యుడిగా ఉండటం, జవాబుదారీతనాన్ని తేవడం అనేవి తెలిసిందే. కానీ కమ్యూనికేషన్ స్వరూపం మారిపోయింది. కొత్తకొత్త రూపాల్లో సామాజిక మాధ్యమాలు వచ్చి సమాజాన్ని కమ్మేస్తున్నాయి. భౌగోళిక సరిహద్దులు చెరిగిపోయాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, టెలిగ్రామ్.. ఇలా కుప్పతెప్పలుగా సామాజిక మాధ్యమ వేదికలు వెలిశాయి. ప్రజలు వీటికి అలవాటుపడటంతో సమాచార మార్పిడి, పంపిణీ వేగంగా జరిగిపోతున్నాయి.
ఆధునిక సాంకేతికత ద్వారా ఒనగూడే సౌకర్యాలకు సానుకూలత, ప్రతికూలత అనే రెండు ముఖాలు నాణేనికి చెరోవైపు అన్నట్టుగా ఉంటాయి. ఈ వేదికలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు పెట్టని కోటగోడలుగా విరాజిల్లుతున్నాయి. వార్తా ప్రసారం ప్రజాస్వామీకరణకు గురవుతున్నది. ఈ రోజు ప్రతి సామాన్యుడూ ఓ రిపోర్టరే. మరోవైపు ఈ సౌకర్యం తీవ్రమైన దుర్వినియోగానికీ గురవుతుండటం మనం చూస్తున్నాం.
దాపరికం అంటూ ఏమీ లేదు, అంతా పారదర్శకమే. అదే సమయంలో నియంత్రణ వ్యవస్థలంటూ లేకపోవడం వల్ల కొన్ని శక్తులు లేదా పార్టీలు వ్యవస్థీకృతంగా సామాజిక మాధ్యమాన్ని వాడుకుంటున్నాయి. ప్రజల ఆలోచనలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఆలోచనలను అదుపు చేసేందుకూ వాడుకుంటున్నాయి. సంఘవిద్రోహ శక్తులూ జాతివ్యతిరేక కార్యకలాపాలకూ వీటినే ఆశ్రయిస్తున్నాయి.
మన దేశంలో సామాజిక మాధ్యమాల యాప్లను నిర్వహిస్తున్న కంపెనీల్లో అత్యధికం బహుళజాతి సంస్థలకు చెందినవే. మన గడ్డ, మన జనం, మన సమాజం పట్ల పట్టింపు, ఎరుక వాటికి ఉండే అవకాశం లేదు. ఇక్కడి డాటాతోపాటుగా లాభాలూ ఎగరేసుకు పోతుంటాయవి. ప్రభుత్వం ఏదో ఒక రూపంలో నియంత్రణకు ప్రయత్నిస్తే సోషల్ మీడియా సంస్థలు ప్రతిఘటించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్క్రిప్టెడ్ డాటా ఇచ్చేందుకు అవి ససేమిరా అంటున్నాయి.
అత్యధిక జనాదరణ కలిగిన వాట్సాప్ మెసెంజర్ మీడియా వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చాంశమైంది. 2021 ఐటీ రూల్స్కు లోబడి ఉండాలని ఒత్తిడి చేస్తే భారత్లో తమ కార్యకలాపాలు నిలిపివేస్తామని సంస్థ ఏకంగా బెదిరింపులకు దిగడం గమనార్హం. వైరల్ అవుతున్న మెసేజ్ను మొదటగా పంపిన వ్యక్తి అంటే మూలకర్త వివరాలు తెలుసుకునే వీలు కల్పించాలని సూచించే 4 (2) నిబంధనను ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ సవాల్ చేసింది.
వ్యక్తులు, గ్రూపుల మధ్య అత్యధిక స్థాయిలో సమాచార మార్పిడి జరిగే ఈ మెసెంజర్ మాధ్యమం హఠాత్తుగా అందుబాటులో లేకుండా పోవడమనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి అనూహ్యమైన విషయం. యాపిల్ కూడా ఈ తరహాలోనే వ్యవహరిస్తున్నది. ప్రభుత్వాలు జాతీయ భద్రతను కారణంగా చూపి కమ్యూనికేషన్ వ్యవస్థపై పట్టు బిగించాలని చూస్తుంటాయి. అదే సమయంలో మీడియా సంస్థలు భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం ప్రతిఘటిస్తుంటాయి.
మరి ఈ సమస్యను కొలిక్కి తేవడం ఎలా అని పరిశీలిస్తే మనమూ సొంత యాప్ను అభివృద్ధి చేసుకోవడం అనేది ఒక పరిష్కారంగా మనకు కనిపిస్తుంది. చైనా లాంటి కొన్ని దేశాలు ఈ విధానాన్ని అమలుచేయడమే కాకుండా సోషల్ మీడియాపై కఠినమైన ఆంక్షలను అమలుచేస్తున్నాయి. దీనివల్ల దేశాల మధ్య కమ్యూనికేషన్ అడ్డుగోడలు మళ్లీ మొలుస్తాయి.
పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారవుతుంది. అంతర్జాతీయ ప్రామాణిక నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవడం వల్ల వైరుధ్యాలు పరిష్కారమవుతాయని భావించవచ్చు. అందుకు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం తరహాలో బహుళపక్ష ఒడంబడికలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. అందుకు సామాజిక మాధ్యమ సంస్థల సహకారంతో సాంకేతిక ప్రొటోకాల్స్ రూపొందించుకుంటే వాట్సాప్ తరహా ప్రతిష్టంభనలు తలెత్తకుండా ఉంటాయి.