‘ఏ వ్యవస్థ, ఏ వ్యక్తీ ప్రశ్నించడానికి వీల్లేదు. నా మాటే శిలా శాసనం’ అనే నిరంకుశ భావన రాజ్యమేలుతున్న వేళ …‘ప్రతి ఒక్కదానిని ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే మనం జీవించి ఉన్నట్టు’ అని న్యాయశాస్త్ర విద్యార్థులకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ పిలుపునిచ్చారు. రెండు భిన్న దృక్పథాలు, రెండు భిన్న తాత్వికతలు ఇవి. కాబట్టే, జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఈ నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వంలో విపరీతమైన అసహనం కనిపిస్తున్నది. అది కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు మాటల్లో తరచూ వ్యక్తమవుతున్నది. ఉన్నత న్యాయమూర్తుల నియామకాల విషయంలో ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తున్నదన్న సుప్రీంకోర్టు స్పందన మీదగానీ, కొలీజియం వ్యవస్థపైన గానీ రిజుజు చేస్తున్న వ్యాఖ్యలు గతంలో ఏ న్యాయమంత్రీ చేయనివి.
ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత కేంద్రం 2014లో ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ ఏర్పాటుకు చట్టం చేసింది. దీనివల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని భావించిన సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని మరుసటి ఏడాదే కొట్టివేసింది. ఈ పరిణామంపై తాజాగా ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ‘ప్రజల విశ్వాసాన్ని పొందిన పార్లమెంటు ఒక చట్టం చేస్తే దానిని న్యాయస్థానం కొట్టేయటం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా?’ అని ప్రశ్నించారు. ఆ సమావేశంలో సీజేఐ కూడా ఉండటం గమనార్హం. ఇటీవలి వరకు బెంగాల్ గవర్నర్గా ధన్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మమతా బెనర్జీ ప్రభుత్వంతో అనునిత్యం కయ్యాలు పెట్టుకొన్నారు. ఆయన చేసిన ఈ ‘సేవలకు’ మెచ్చుకోలుగా ఉప రాష్ట్రపతి లభించింది. ఇప్పుడు ఆయన ఏకంగా సుప్రీంకోర్టుపై విరుచుకు పడుతున్నారు.
ప్రజా ప్రాతినిధ్య సభకు ఉండే శాసనాధికారం విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. పార్లమెంటుకున్న అధికారాన్ని అసందర్భంగా ప్రస్తావిస్తున్న ధన్కర్ తాను గవర్నర్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ మాత్రం గౌరవించినట్టు? రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నవి కాదా? రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు స్వతంత్రతను కూడా ప్రశ్నిస్తున్నది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది ప్రజాస్వామిక మౌలిక సూత్రం. అందుకే మన రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య అధికార విభజన చేసింది. ఈ ఏర్పాటు వల్లనే దేశంలో ఇంతకాలం ప్రజాస్వామ్యం మనగలిగింది. రాజ్యాంగ సంస్థల పట్ల మోదీ సర్కారు వ్యవహార సరళి దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నది. న్యాయశాస్త్ర కోవిదుడిగా, ఉదార భావాలున్న న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ చంద్రచూడ్పై ప్రజాస్వామ్య ప్రియులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండటం న్యాయమూర్తుల ప్రయోజనాల కోసం కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరం.