తెలంగాణ విముక్తి ప్రదాతే బంగారు భవితకు బాటలు వేసిన నవయుగ నిర్మాత కావడం ఓ చారిత్రక విశేషం. సకల జనులనూ ఒక్కటిచేసి రాష్ట్ర సాధన ఉద్యమం నడిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నివర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా, సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పరిపాలన చేపట్టారు. తెలంగాణ కీర్తికాంతులు దశదిశలా విస్తరించేలా చల్లనిపాలన అందించారు. రెండు విడతలు ప్రజలు జేజేలు పలికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు మూడో విడతకు సమయం వచ్చింది. సాధించినదానితో సంతృప్తిని చెందడం సీఎం కేసీఆర్ డిక్షనరీలోనే లేదు. నిరంతరం నిత్య నూతనంగా ఆలోచించడం, వ్యూహాలు నిర్దేశించుకొని గమ్యాన్ని ముద్దాడటం తనకు వెన్నతో పెట్టిన విద్య. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన విడుదల చేసిన మ్యానిఫెస్టో మూడో విడత పరిపాలన ప్రణాళికలను ఆవిష్కరించింది.
సీఎం కేసీఆర్ ఊహల్లో రూపుదిద్దుకున్న రైతుబంధు పథకం సాగు చరితలో ఓ వినూత్న అధ్యాయం. దేశంలోని రైతాంగం దృష్టిని ఆకర్షించిన ఈ పథకం కింద ప్రస్తుతం ఎకరానికి ఏటా ఇస్తున్న సాయం పది వేలను దశలవారీగా పదహారు వేలకు పెంచుతామని ప్రకటించడం శుభపరిణామం. అన్నదాతల కళ్లల్లో సంతోషాన్ని నింపే హామీ ఇది. రేషన్పై సన్నబియ్యం ఇస్తామనే హామీ ఆచరణాత్మకమైందే కాదు, ఆహ్వానించదగినది కూడా. ఇచ్చిన బియ్యం దారి మళ్లకుండా సద్వినియోగమయ్యేందుకు దోహదం చేసే చక్కని ఆలోచన. ఐదు లక్షల జీవిత బీమా రూ.15 లక్షల ఆరోగ్యబీమా అందించడం పేద కుటుంబాలకు ధీమా కల్పిస్తుందని చెప్పవచ్చు. ఈ రెండు పథకాలకు సీఎం కేసీఆర్ పేరు పెట్టడం సముచితం.
ఆసరా పింఛన్లను దశల వారీగా రూ.5016కు పెంచుతామన్న ప్రతిపాదన వృద్ధులకు, ఇతరులకు లబ్ధి చేకూరుస్తుంది. నిరుపేదలకు నీడ కల్పించేందుకు ఉద్దేశించిన డబుల్ బెడ్రూం పథకం కింద హైదరాబాద్ నగరంలో మరో లక్ష ఇండ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. కేంద్రం పెట్టిన వంటగ్యాస్ మంట నుంచి గృహిణులను విముక్తం చేసేందుకు సిలిండర్ను రూ.400కే ఇస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. కాంట్రిబ్యూటరీ పింఛన్ స్థానంలో పాత పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీ వేయనున్నట్టు ప్రకటించడం ఉద్యోగుల సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్కు గల నిబద్ధతకు నిదర్శనం. ఇలా ఒక్కో వర్గం గురించి ఆచితూచి అంచనాలు వేసి మ్యానిఫెస్టోను రూపొందించారని చెప్పవచ్చు.
చెప్పినవి చేయడం, చెప్పనివీ చేయడమనేది బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విధానం. మ్యానిఫెస్టో అనేది ఆయన దృష్టిలో ఓట్ల కోసం విసిరే వల ఎంతమాత్రం కాదు. ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడం, ఆపై మరిచిపోవడమనేది ఆయన చరిత్రలోనే లేదు. తొందరపడి మాట ఇవ్వరు. ఇస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతదాకానైనా పోతారు. అర్రాసు తరహాలో కాంగ్రెస్ ఇచ్చిన అమలుకు నోచుకోని హామీలు కావివి. ఖర్చెంత అవుతుందో తెలియకుండానే, ఓటరును బులిపించే మాయదారి హామీలు అసలే కావు. రెండు విడతల పాలన విజయాలను ముందుకు తీసుకువెళ్లే రీతిలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో రూపొందించారనడం అతిశయోక్తి కాదు. అన్నివర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన సమతుల అంశాలు ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్నిటిని దశలవారీగా పెంచుతామనడం ఆచరణాత్మకతకు గీటురాయి.