పీడకులు చేసినా, పీడితులు చేసినా యుద్ధం ఎప్పుడూ మరణాన్నే వర్షిస్తుంది. కత్తి విసిరినా, తూటా పేల్చినా తల్లిపేగునే కాటేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్-గాజా యుద్ధంలోనూ జరుగుతున్నది ఇదే. గత శనివారం గాజా నుంచి హమాస్ సంస్థ ఇజ్రాయెల్ మీదకు వేల సంఖ్యలో క్షిపణులు పేల్చింది. ఆ తర్వాత హమాస్ సాయుధులు ఇజ్రాయెల్ భూ భాగంలోకి ప్రవేశించి సైన్యంపై, పౌరులపై దాడులు జరిపారు. వేగు వ్యవస్థలో పేరెన్నికగన్న ఇజ్రాయెల్ను ఈ దాడి ఒకింత దిగ్భ్రమకు గురిచేసింది. క్షిపణిదాడుల్లో ఇజ్రాయెలీ పౌరులు వందల సంఖ్యలో మరణించారు. వారిలో కొందరు విదేశీ పౌరులూ ఉన్నారు. వందల సంఖ్యలో పౌరులను హమాస్ బందీలుగా పట్టుకున్నదని వార్తలు వచ్చాయి. ఇజ్రాయెల్ స్పందన సహజంగానే భీకరంగా ఉన్నది.
‘శత్రువు ఘాతుకానికి ఒడిగట్టాడని, కనీవినీ ఎరుగని రీతిలో ప్రతికారం ఉంటుందని’ ఇజ్రాయెల్ హెచ్చరించింది. అన్నట్టే గాజాను అష్ట దిగ్బంధనం చేసింది. నీటితో సహా అన్ని నిత్యావసరాల సరఫరాలను స్తంభింపజేసింది. తన దగ్గరున్న శక్తిమంతమైన, భీషణమైన అస్ర్తాలను సంధించి జనావాసాలను బూడిద కుప్పలుగా మారుస్తున్నది. గాజాలో నెత్తుటేరులు పారిస్తున్నది. ఇజ్రాయెల్ మిత్రులైన అమెరికా, బ్రిటన్, తదితర పశ్చిమదేశాలు హమాస్ దాడిని తీవ్రంగా ఖండించాయి. ‘మరో సెప్టెంబర్ 11’ దాడులనే పోలికలూ వినిపించాయి. ఇక భారత్ విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ హమాస్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నట్టు ప్రకటించారు. హమాస్ సాయుధ బలగాలను భారత్ ఉగ్రవాదులుగా అభివర్ణించడం చరిత్రలో బహుశా ఇదే ప్రథమం.
ఇది ఎవరూ ఊహించిన దాడి కాదు. దీన్ని పసిగట్టడంలో ఇజ్రాయెల్కు చెందిన పేరు మోసిన గూఢచార సంస్థ మొసాద్ వైఫల్యాన్ని అందరూ ఎత్తి చూపుతున్నారు. చీమ చిటుక్కుమన్నా పసిగట్టేస్తుందని మొసాద్కు పేరుంది. విదేశాల నుంచి ఇజ్రాయెల్ శత్రువులను సజీవంగా మూటకట్టి తెచ్చిపడేసిన చరిత్ర దానికున్నది. వేల సంఖ్యలో హమాస్ క్షిపణులను పోగేసుకుంటుంటే, వాటిని ఇజ్రాయెల్పైకి మోహరిస్తూ ఉంటే మొసాద్ ఏం చేసిందని ఇజ్రాయెలీలు నిలదీస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పాలక, విపక్షాలు మమేకమైపోయి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ నాయకత్వంపై తీవ్ర విమర్శలు రావడం గమనార్హం. ఆయన అనుసరించిన అడ్డూ అదుపూ లేని అనాలోచిత విస్తరణవాద విధానాలే ప్రస్తుత ఘర్షణలకు కారణమని దుయ్యబట్టేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. నెతన్యాహూ అనుసరించిన అడ్డూ అదుపూలేని దురాక్రమణ పూరిత విధానాలే హమాస్ నిస్పృహపూరిత దాడులకు కారణమని ప్రముఖ ఇజ్రాయెలీ పత్రిక ‘హారెట్జ్’ దుయ్యబట్టింది. ఏది ఎలా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్-గాజా సరిహద్దుకు అటూ ఇటూ బీభత్సం రాజ్యమేలుతున్నది. మృతుల సంఖ్య వందలు దాటి వేలకు పోతున్నది.
పశ్చిమాసియాకు యుద్ధం కొత్తకాదు. ఇరవయ్యో శతాబ్దంలో అత్యధిక యుద్ధాలను చూసిన నేల అది. హఠాత్తుగా మొదలైనట్టుగా కనిపిస్తున్న హమాస్ దాడి వెనుక పాలస్తీనా కథ ఉంది. వందేండ్ల వ్యథ ఉన్నది. దీని పూర్వాపరాల గురించి విశ్లేషకులు చరిత్రను తవ్విపోసి భాష్యాలు రాస్తున్నారు. కానీ యుద్ధం తన పని తాను చేసుకుపోతున్నది. నిజానికిది ఇజ్రాయెల్-హమాస్ తగాదా కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలస్తీనా సమస్య తాజా విస్ఫోటనం. ఈ తరానికి పాలస్తీనా సమస్య గురించి అంతగా తెలియదు. పైన చెప్పినట్టు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సమస్యపై భారత్ వైఖరి మారిపోయింది. ఈ మార్పు వెనుక గల రాజకీయాంశాల సంగతి అలా ఉంచితే పాలస్తీనా సమస్యను పరిష్కరిస్తే గానీ పశ్చిమాసియాలో శాంతి నెలకొనదు. అందుకు ప్రపంచదేశాలు పూనుకోవాలి. ఇజ్రాయెల్ మనస్ఫూర్తిగా సహకరించినప్పుడే శాశ్వత శాంతి సాధ్యం.