పునర్వినియోగ వాహక నౌక తయారీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న కృషి మరో మైలురాయిని దాటింది. వాయుసేన, డీఆర్డీఓతో కలిసి కర్ణాటకలోని చిత్రదుర్గలో ‘ఆర్ఎల్వీ అటానమస్ ల్యాండింగ్ మిషన్’ను ఇస్రో ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. 4.5 కిలోమీటర్ల ఎత్తుకు హెలికాప్టర్లో తీసుకెళ్లిన వాహనాన్ని అక్కడినుంచి వదలటం, అది సురక్షితంగా భూమిని చేరటం జరిగింది. ఈ విధంగా ఇరువై ఏండ్ల నాటి ప్రతిపాదన కార్యరూపం దాల్చే ప్రక్రియ మరింత ముందుకువెళ్లింది. అంతరిక్ష పరిశోధనల్లో పునర్వినియోగ వాహకనౌక స్థానం కీలకమైనది. రోదసి పరిశోధనలకు ఎక్కువ వ్యయం కావడటానికి ముఖ్య కారణాల్లో ఒకటి.. వాహక నౌకలు పునర్వినియోగానికి అనుకూలంగా లేకపోవటం. ప్రయోగం జరిగిన ప్రతిసారీ కొత్తగా వాహక నౌకను తయారుచేయటం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికి పరిష్కారమే పునర్వినియోగ వాహక నౌక (ఆర్ఎల్వీ).
దీనిపై ఇస్రో చాలాకాలంగా కసరత్తు జరుపుతున్నది. ఆర్ఎల్వీ డిజైన్ను 2012లో ఆమోదించారు. ఆ నమూనా మీద ఐదు దశల పరీక్ష లు జరపాలని నిర్ణయించారు. అవి హెచ్ఈఎక్స్, ఎల్ఈఎక్స్, ఆర్ఈఎక్స్, పవర్డ్ క్రూయిజ్ ఫ్లైట్ ఎక్స్పరిమెంట్, స్క్రామ్జెట్ ప్రొపల్షన్ ఎక్స్పరిమెంట్. 2016లో తొలి దశ పరీక్ష హైపర్సానిక్ ఫ్లైట్ ఎక్స్పరిమెంట్ (ఆర్ఎల్వీ హెచ్ఈఎక్స్)ను బంగాళాఖాతంలో విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం జరిగింది రెండో దశ పరీక్ష. దీనికో సం ల్యాండింగ్ గేర్, ఏరోఫిల్ హనీకాంబ్ ఫాన్స్, బ్రేకింగ్ పారాచ్యూట్ సిస్టమ్, సూడో శాటిలైట్, నావిగేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఇస్రో ఉపయోగించింది. ఈ రెండోదశలో కీలకమైన రీ ఎంట్రీ, అటానమస్ హైస్పీడ్ ల్యాండింగ్లను విజయవంతంగా పరీక్షించారు. పూర్తిస్థాయి పునర్వినియోగ వాహక నౌకను దేశీయంగా తయారుచేయాలంటే మరో మూడు దశలు దాటాల్సి ఉన్నది.
పునర్వినియోగ వాహక నౌకలు ప్రస్తుతం ప్రపంచంలో ఐదు మాత్ర మే ఉన్నాయి. ఇవన్నీ స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి ప్రైవేటు సంస్థలకు చెందినవే. రష్యా, అమెరికాలకు చెందిన బురాన్, స్పేస్ షటిల్ పాతబడి పోవటంతో వాటిని ప్రస్తుతం పక్కనపెట్టారు. పలు దేశాలు పునర్వినియోగ వాహక నౌకల మీద పెద్ద ఎత్తున ఖర్చుచేస్తూ పరిశోధనలు జరుపుతున్నాయి. మొత్తంగా 13 నమూనాలు ప్రయోగ దశలో ఉన్నాయి. వీటిలో ఇస్రో ఆర్ఎల్వీ ఒకటి. పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత ఆర్ఎల్వీ.. భూ నిమ్న కక్ష్యలో పేలోడ్ను ప్రవేశపెట్టి తిరిగి రాగలదు. ఇస్రో ఇప్పటికే అంతరిక్ష పరిశోధనల్లో అనేక అద్భుతమైన విజయాలను సాధించింది. ఎన్నో ప్రయోగాల తర్వాతే అగ్రదేశాలకు సాధ్యమైన మార్స్ మిషన్ను తొలి ప్రయత్నంలోనే సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. చంద్రయాన్తో జాబిల్లిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. చవకైన, సమర్థవంతమైన రోదసి ప్రయోగాలకు ఇస్రో కేంద్రంగా మారింది. పలు దేశాలు తమ ఉపగ్రహ ప్రయోగాల కోసం ఇస్రో సేవలను తీసుకుంటున్నాయి. పునర్వినియోగ వాహక నౌక విషయంలోనూ ఇస్రో ఘన విజయం ఖాయం.