అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో కీలక మైలురాయిని దాటింది. సంపన్న దేశాలకు దీటుగా స్వావలంబనను చాటుకుంది. చక్కనయ్య, చల్లనయ్య చందమామను చంద్రయాన్ ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా ముద్దాడింది. నరాలు తెగిపోయే ఉత్కంఠకు సంతోషకరమైన రీతిలో తెరపడింది. వెన్నెల వాకిటిలో మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. విజయోత్సాహంతో దేశం మురిసి మెరిసిపోయింది. ఈ విజయానికి సూత్రధారి అయిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అభినందనలు వెల్లువెత్తాయి. రాకెట్ల రంగంలో తిరుగులేని ఆధిక్యం సాధించిన ఇస్రో ఇప్పుడు చంద్రునిపైకి లంఘించి మరో మెట్టు అధిగమించింది. అహోరాత్రాలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఇస్రో బృందం చేసిన కృషి ఫలించింది. ఓ భారీ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ వ్యయంతో ఇస్రో చంద్రుని మీదకు రోవర్ పంపడం చూసి ప్రపంచం ముక్కు మీద వేలేసుకుంది. భారత్ను స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో దేశాలు చంద్రుని మీదకు దృష్టి సారిస్తున్నట్టు వార్తలు వెలువడుతుండటం సంతోషించదగ్గ విషయం.
భారత్ లాంటి వర్ధమాన దేశం ప్రపంచం తిరిగి చూసే అంతరిక్ష విజయం సాధించడం మామూలు విషయమేమీ కాదు. చంద్రుని మీదకు ఇదివరకు జరిపిన ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. అపజయాలు చూసి కుంగిపోకుండా వాటినే విజయాలకు సోపానాలుగా మలచుకొన్న ఇస్రో శాస్త్రవేత్తల పట్టుదల ప్రశంసనీయం. ఈ విజయపరంపరకు ఆనాడు అంతరిక్ష పరిశోధనకు బీజాలు వేసిన పెద్దలను స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. ముఖ్యంగా ఇస్రో వ్యవస్థాపకుడైన విక్రమ్ సారాభాయ్ సేవలు మరువరానివి. అరవై ఏండ్ల కిందట అప్పటి ప్రధాని నెహ్రూ ఇస్రోకు అంకురార్పణ చేస్తే ఆ తర్వాత 13 సంవత్సరాలకు సోవియట్ యూనియన్ సహకారంతో భారత్ తొట్టతొలి ఉపగ్రహం ఆర్యభట్ట నింగికెగసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన సగర్వంగా భారత్ నిలిచింది.
ఒకప్పుడు సైకిల్ క్యారేజీ మీద రాకెట్ విడిభాగాలు మోసుకు వెళ్లిన చేతులకు మొక్కుకోవాల్సిందే. వారందరి కృషి, అంకితభావం వల్లనే ఇవాళ భారతదేశం రాకెట్ ప్రయోగాలకు గమ్యస్థానంగా మారింది. తాజాగా మరో అడుగు ముందుకు వేసి చంద్రునిపైకి రోవర్ను దిగ్విజయంగా దింపి సత్తా చాటింది. ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలోని చంద్రుని ఉపరితలంపై వ్యోమనౌకను ఒడుపుగా దించడం, అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ను జాగ్రత్తగా బయటకి రప్పించడం, చక్కగా పనిచేయించడం మామూలు విషయమా? సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెంది కృత్రిమ మేధ వికసిస్తున్న ఈ రోజుల్లోనూ ఇది క్లిష్టమైన ప్రక్రియే. మన కమాండ్ కంట్రోల్ వ్యవస్థ సాధించిన అభివృద్ధిని ఇది సూచిస్తున్నది. అయితే చంద్రయాన్ విజయం ఓ మజిలీ మాత్రమే. దాటాల్సిన మైలురాళ్లు ఇంకా ఎన్నో ఎదురు చూస్తున్నాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇస్రో మరెన్నో విజయబావుటాలు ఎగురవేస్తుందని ఆశిద్దాం.