అట్లుంటది కేసీఆర్ తోటి. అదీ తన మాస్టర్ స్ట్రోక్ అంటే. ఎన్నికల సమరం మొదలు కాకముందే తన సైన్యాలను మోహరించి, హ్యాట్రిక్ విజయం కోసం సమరభేరి మోగించారు వన్ అండ్ ఓన్లీ కేసీఆర్. అసమ్మతి భయం లేదు. తిరుగుబాట్ల అనుమానం అంతకంటే లేదు. సిట్టింగులపై విముఖత అన్న జంకు ఏమాత్రం లేదు. దమ్మున్న లీడర్ కేసీఆర్ ఒకేసారి 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి తన సత్తా చాటుకున్నారు. దమ్ముంటే గజ్వేల్ నుంచి పోటీచేయమన్న విపక్షాల సవాల్ను దర్జాగా స్వీకరించారు. ఎన్నికలకు ఇంత ముందుగా ఒకే దెబ్బలో దాదాపు మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం అనేది బహుశ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి కావచ్చు. థింక్ బిగ్ అనేది కేసీఆర్ నినాదం. తన పార్టీ మీద, తన పాలన మీద రెఫరెండం కోరడంగా దీనిని భావించవచ్చు. సమకాలీన రాజకీయ నాయకుల్లో ఇంత తెగువ, ఇంత ప్లానింగ్, ఇంత పట్టు, ప్రజల ఆదరణ మీద ఇంత అచంచల విశ్వాసం ఉన్న నాయకుడు మనకు మరొకరు కనిపించరు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితా ముందస్తుగా ప్రకటించి లక్ష్యసాధనకు పూర్తి ఆత్మవిశ్వాసంతో నడుం బిగించారు సీఎం కేసీఆర్. ఇవిగో మా గెలుపు గుర్రాలంటూ పగటికలలు కంటున్న ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. బయట పుకార్లు షికార్లు చేసినట్టుగా పెద్దగా అభ్యర్థులను మార్చలేదు. విజయావకాశాలే గీటురాయిగా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నది అక్షరసత్యం. ఇందుకు సీఎం కేసీఆర్ లోతైన మేధోమథనమే జరిపారు. నియోజకవర్గాలవారీగా సమీక్ష జరిపి పకడ్బందీ పథకంతో ముందుకు కదిలారు. రెండుసార్లు ప్రజల ఆశీస్సు పొందిన అనుభవంతో మూడోసారి విజయానికి వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. అభ్యర్థుల ప్రకటనతో అందులో తొలిమెట్టు పూర్తయింది.
నిజానికి కేసీఆర్ ఎన్నికల సన్నద్ధత ఎన్నికలు సమీపించినప్పుడు మొదలు కాదు. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి ఎన్నికల సన్నద్ధతే. ఎన్నికలు వచ్చినప్పుడు అవీఇవీ హమీలు గుప్పించడం, ఆ తర్వాత మరిచిపోవడం కాదు.. హామీ ఇవ్వనివీ చేసిచూపడం ఆయన ప్రత్యేకత. ఓవైపు సకల జనుల సంక్షేమాన్ని, మరోవైపు సమగ్ర అభివృద్ధిని జోడుగుర్రాల్లా పరుగెత్తిస్తూ పరిపాలనలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. మేం సాధించిన మంచిపనులు చూసి మాకు ఓటేయండి అని అడిగే బస్తీమే సవాల్ పార్టీ బీఆర్ఎస్. కేవలం నాలుగు ఓట్లు సాధించేందుకు ఏవేవో ఫీట్లు చేయడమన్నది ఆ పార్టీ చరిత్రలోనే లేదు. తెలంగాణను సాధించిన పార్టీ తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చి దేశానికే ఆదర్శంగా నిలబెట్టింది. బీఆర్ఎస్ పరిపాలనకు ముందు, తర్వాత అని చెప్పుకునే పరిస్థితి. సమైక్యరాష్ట్రంలో కలలో కూడా ఊహించని అభివృద్ధి స్వరాష్ట్రంలో కాళేశ్వర జలాల సాక్షిగా వాస్తవరూపంలో సాక్షాత్కరిస్తున్నది. విపక్షాలు ఇంకా ఇంటిని చక్కదిద్దుకునే ప్రయాసలో ఉండగానే సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించడం ఆయన సర్వసన్నద్ధతకు, అంతకుమించిన అచంచలమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.