రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలకు భరోసా కల్పించే రైతుబీమా లక్ష మార్కును దాటడం ఒక రికార్డు. 2018లో మొదలైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 1,00,782 కుటుంబాలకు రూ.5,039 కోట్ల పరిహారం లభించింది. రైతుల నుంచి పైసా ప్రీమియం వసూలు చేయకుండా, వారు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించే రైతుబీమా వంటి పథకం మన దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ బీమా పథకాన్ని ప్రారంభించిన నాడు ముఖ్యమంత్రి కేసీఆర్.. తన జీవితంలో తాను చేసిన అత్యంత గొప్ప పనిగా దీనిని భావిస్తున్నానని చెప్పారు. అప్పుల భారంతో నలిగిపోయిన రైతు కుటుంబాలు, పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు రోడ్డున పడే దుస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. తెలంగాణ వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దశ అది. దానిని కళ్లారా చూసిన కేసీఆర్ ఆ పరిస్థితిని సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రైతు సంక్షేమమే కేంద్రంగా చేపట్టిన కార్యక్రమాలన్నీ దీంట్లో భాగమే.
తెలంగాణలో రైతురాజ్యాన్ని నెలకొల్పటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం అనేక పథకాలను అమలు పరిచింది. పొలాలకు కాలువల ద్వారా నీరు అందేలా సాగునీటి ప్రాజెక్టులు కట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను కేవలం మూడేండ్లలో నిర్మించింది. మిషన్ కాకతీయతో చెరువులను బాగుపరిచింది. తెలంగాణలో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు పెరిగాయి. వాటిని తోడుకోవటానికి వీలుగా 24 గంటల పాటు ఉచిత కరెంటును రైతులకు అందించింది. పెట్టుబడి కోసం రైతన్నలు అప్పుల పాలు కాకుండా రైతుబంధును తీసుకొచ్చింది. కల్తీ విత్తనాలు, పురుగుమందులపై ఉక్కుపాదం మోపి, నాణ్యమైనవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. రైతులు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవటానికి వీలుగా రైతు వేదికలు నిర్మించింది. ధాన్యం ఆరబోతకు కళ్లాలను నెలకొల్పింది. కేంద్రం మొండిచేయి చూపినా, ధాన్యం కొనుగోలుకు నేనున్నానంటూ ముందుకొచ్చింది. రైతు కేంద్రబిందువుగా జరిగిన ఈ సమగ్ర కార్యాచరణలో మరో అడుగు.. రైతుబీమా. తెలంగాణ వచ్చిన తర్వాత తెరిపినపడ్డ కర్షక కుటుంబాలలో, ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే, మళ్లీ ఆ కుటుంబం పరిస్థితి మొదటికి రాకూడదన్న సదుద్దేశంతో దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
సాధారణంగా రైతుబీమా పథకాలు ప్రమాద బీమాలుగానే ఉంటా యి. ఏదైనా ప్రమాదం బారిన పడి రైతు మరణించినప్పుడు ఇవి వర్తిస్తాయి. నాటి వ్యవసాయశాఖ మంత్రి కూడా సీఎం కేసీఆర్కు ఇదే ప్రతిపాదన చేశారు. ఈ పద్ధతిలో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం చాలా తక్కువ. కానీ, సీఎం అందుకు అంగీకరించకుండా, జీవిత బీమా కల్పిద్దామని, అప్పుడే రైతు కుటుంబాలకు పూర్తి భరోసా ఉంటుందని చెప్పారు. రైతుల బాధలను తీర్చాలనే ఆర్తి ఎంత ఉంటే ఈ మాట వస్తుంది! ఇలా మొదలైన రైతుబీమా లక్ష కుటుంబాలకు అండగా నిలిచింది. నేడు ఈ పథకం పరిధిలో ఉన్న 37.77 లక్షల మంది రైతుల్లో అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ. తమ సంస్థ చరిత్రలో రైతుబీమా ఒక రికార్డని, ఇన్ని లక్షలమందికి సామూహికంగా జీవిత బీమా కల్పించిన ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదని తెలంగాణ సర్కారుతో ఎంఓయూ సందర్భంగా ఎల్ఐసీ ప్రతినిధులు హర్షం వెలిబుచ్చారు. ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’ పేరిట ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ గుర్తించిన 700 ఆవిష్కరణల్లో టాప్-20లో రైతుబంధు, రైతుబీమా నిలిచాయి. తెలంగాణ మాడల్ను దేశానికి ఆదర్శంగా నిలిపిన మణిపూసల్లో రైతుబీమా ఒకటి.