ఇదీ కనీవినీ ఎరుగని దుస్థితి. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం ఏనాడూ ప్రపంచం ముందు తలవంచుకోలేదు. ఏనాడు ఇతర దేశాలతో ఇది తప్పు అని చెప్పించుకోలేదు. మనమేమీ అగ్రదేశం కాదు.. ఆర్థికంగా ప్రపంచశక్తీ కాదు. కానీ, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వివిధ భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, మతాలు, కులాల వంటి వైవిధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ.. ఇదంతా ఒకదేశం.. మనమంతా భారతీయులం అని సగర్వంగా చాటుకునేవాళ్లం. ఈ భిన్నత్వంలో ఏకత్వం కారణంగానే యావత్ ప్రపంచం మన దేశాన్ని గౌరవించేది. చైనా వంటి బలమైన ఆర్థికశక్తులు మన పొరుగునే ఉన్నా.. వాటికి దక్కని గౌరవం మనకు లభించింది ఇందుకే. అటువంటి భారతదేశానికి ఈ రోజు బీజేపీ పాలకులు తలవంపులు తీసుకొచ్చారు.
ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో మొత్తం ప్రపంచదేశాలు ఏదో ఒక శిబిరంలో ఉన్న పరిస్థితి. ఆ సంక్షోభ సమయంలో భారత్.. అటు రష్యాకు అనుకూలంగా ఉంటూనే ఇటు అమెరికాతో సంబంధాలు చెడకుండా చూసుకున్నది. ఆ పరీక్షా సమయంలో కూడా భారత్ను ఎవరూ వేలెత్తి చూపలేదు. మన అలీనోద్యమం అనేక దేశాలకు దౌత్యనీతిలో పాఠాలను నేర్పించింది. పక్కనున్న పాక్తో ఎన్ని గొడవలున్నా అరబ్ ప్రపంచంతో, ఇస్లామిక్ దేశాలతో దశాబ్దాల స్నేహబంధం మనకుంది. అటువంటి ఘన చరిత్ర ఉన్న భారత విదేశాంగ విధానం నేడు.. బీజేపీ పాలనలో కుప్పకూలిపోయింది. సంజాయిషీ ఇచ్చుకునే దుస్థితికి చేరుకున్నది. ఆ పార్టీ నాయకులలో వివేకం, విచక్షణ లోపించిన ఫలితమిది. ఎంత దిగజారి మాట్లాడితే అంత గొప్ప. మరునాడే ఆ వ్యక్తికి పార్టీలో ప్రమోషన్. మోదీ-షా ఎనిమిదేండ్లుగా బీజేపీలో అమలు చేసిన విధానమే ఇది. దీని ఫలితమే నేడు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ ప్రేలాపనలు. పైనున్న కేంద్రప్రభుత్వం, బీజేపీ అధిష్ఠానం దృష్టిలో మార్కులు పడుతాయని ఆశించే వారు అడ్డగోలు వ్యాఖ్యలు చేశా రు. కానీ, ఈసారి కథ అడ్డం తిరిగింది. యావ త్ ఇస్లామిక్ ప్రపంచం ఇదేం రీతి అని నిలదీసేసరికి కుహనా దేశభక్తులకు ఒక్కసారిగా గొంతులో వెలక్కాయ పడినట్లయ్యింది.
నూపుర్శర్మ, నవీల్జిందాల్ మాటలు తమ ప్రభుత్వానివి కావని, అవి ‘సభ్యసమాజం బయట ఉన్న మూకల’ మాటలని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్లామిక్ దేశాలకు వివరణ ఇచ్చుకుంది. అవునా! నిజంగానా! అవి మూకల మాటలైతే, దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేసిన అనేకానేక మతవిద్వేష వ్యాఖ్యలను బీజేపీ ఎందుకు ఖండించలేదు? కర్ణాటక, గుజరాత్, అస్సాం తదితర బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ముఖ్యమంత్రుల, తమ పార్టీ నేతల విషపూరిత మాటలను ఎందుకు నియంత్రించటం లేదు? అంతెందుకు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ‘మసీదులను తవ్వుదాం’ అంటూ చేసిన వ్యాఖ్యను ఎందుకు వెనకేసుకొచ్చారు? అంటే, బీజేపీ విధానమే విద్వేషపూరితమైనదని స్పష్టమవుతున్నది. కానీ, అదే తమ విధానమని బహిరంగంగా చెప్పుకోలేరు. ఎందుకంటే దేశ ప్రజలుగానీ, చుట్టూ ఉన్న ప్రపంచంగానీ ఆమోదించరు కాబట్టి. మన ప్రియ మాతృభూమిని మధ్యయుగాల అంధకారంలోకి తీసుకెళ్తున్న వారిని రాజకీయంగా శిక్షించకపోతే దేశానికి మనుగడ ఉండదు.