ఒక ఇంజినీర్, ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రజానాయకుడు, ఒక రాజనీతిజ్ఞుడు, ఒక వ్యూహకర్త, ఒక విధాన రూపశిల్పి.. వీటన్నింటికీ మించి ఆయన ఒక గొప్ప స్వాప్నికుడు, పుట్టిన గడ్డ మీద అమితమైన ప్రేమ ఉన్న భూమి పుత్రుడు.. వీరందరూ కలిసి ఒక వ్యక్తిగా మూర్తీభవించారు కాబట్టే కాళేశ్వరాన్ని సాధ్యం చేయగలిగారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎంత బిరబిరా పరుగులెత్తి కట్టినా కనీసం 15 ఏండ్లు పడుతుందని నిపుణులు అంచనాలు వెలువరించారు. కానీ, వారు ఊహించిన దానిలో ఐదో వంతు సమయంలోనే నిర్మితమైంది. 2016 మే 2న శంకుస్థాపన జరిగితే 2019 జూన్ 21న పూర్తయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ మూడేండ్లలో పూర్తి చేసేసరికి, భారతదేశమే కాదు, ప్రపంచమే ఆసక్తిగా గమనించింది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అప్పటివరకూ రికార్డుల్లో ఉన్న అమెరికాలోని కొలరాడో ప్రాజెక్టు, లిబియాలోని ‘గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్’ ఎత్తిపోతల పథకాలను తలదన్నింది కాళేశ్వరం.
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన అపూర్వమైన కానుకల్లో తలమానికం కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిద్వారా తెలంగాణ పునర్నిర్మాణం అసలైన అర్థంలో ప్రారంభమైంది. నేడు రాష్ట్రం నలుచెరగులా నీటి ప్రవాహాలు, పచ్చటి పంటలు, అగ్రస్థానంలో ఉన్న పంజాబ్తో పోటీ పడుతూ ధాన్యం ఉత్పత్తి, రైతుల ఇండ్లల్లో, వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో, గ్రామసీమల్లో సంతోషం. ఈ విధంగా చూసినట్టయితే.. కాళేశ్వరం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు.. తెలంగాణ దశ దిశను మార్చిన బహుళార్థ సాధక పథకం. ఇంతటి ప్రాధాన్యం ఉంది కనుకనే, ఈ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కేసీఆర్ ఇంజినీరింగ్ వంటి సాంకేతిక అంశాల నుంచి పొరుగు రాష్ర్టాలతో, కేంద్రప్రభుత్వంతో సమన్వయం వరకూ ప్రతి రంగాన్నీ స్వయంగా సమీక్షిస్తూ దిశానిర్దేశం చేశారు. ఆయన వ్యూహరచన ఫలితంగానే అడ్డంకులు తొలగిపోయి ఈ మానవాద్భుతం సాకారమైంది. కేంద్రం పైసా ఇవ్వకపోయినా, తరతరాల తెలంగాణ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెటుకొని, భారీవ్యయాన్ని సాంతం రాష్ట్రప్రభుత్వమే భరించింది.
పరిశ్రమలు తప్ప వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడం ఇటీవలి కాలపు పోకడ. ఇదే రీతిలో నగరాల అభివృద్ధిని మాత్రమే పట్టించుకుంటూ గ్రామీణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సాధారణమైపోయింది. పారిశ్రామికీకరణపైనా, విద్యావంతుల ఉపాధిపైనా చూపిన శ్రద్ధను గ్రామీణ వృత్తి నైపుణ్యాల పెంపుపై చూపే వారు కాదు. కానీ పారిశ్రామికీకరణకు పెద్ద పీట వేస్తూనే, వ్యవసాయరంగంపైనా, మొత్తంగా గ్రామీణాభివృద్ధిపైనా ఏకకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. దాంట్లో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిద్వారా తెలంగాణ అంతటా వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయింది. హరిత విప్లవానికి ఆధునిక ఉదాహరణగా రాష్ట్రం నిలిచింది. వేలాదిగా అందుబాటులోకి వచ్చిన జలాశయాలను దృష్టిలో ఉంచుకొని, మత్స్యకారులకు చేపపిల్లల ఉచిత పంపిణీ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో మత్స్సవిప్లవమూ సాధ్యమైంది. విస్తారంగా పెరిగిన పచ్చికబీళ్లను సద్వినియోగం చేసుకునేలా గొర్ల పెంపకాన్ని చేపట్టింది. మాంసం ఉత్పత్తిలో రికార్డులు నెలకొల్పింది తెలంగాణ. జనాభాలో అత్యధికులైన రైతులను, కులవృత్తుల వారిని సంపన్నులను చేయటం ద్వారా సమాజాన్ని సుసంపన్నం చేసే ఆర్థిక నమూనా ఇది. ఇది విజయవంతమైందని మన గణాంకాలే కాదు, ప్రతిష్ఠాత్మక ప్రైవేటు ఆర్థిక సంస్థలు, కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకాలూ స్పష్టం చేస్తున్నాయి. ఇది కేసీఆర్ విజయం. ఇది కాళేశ్వరం విజయం.