వంట గ్యాస్ ధర మళ్ళా పెరిగింది. ఈ పెరుగుదల కొత్త కాదు. మోదీ అధికారానికి వచ్చిన తరువాత సిలిండర్ ధర అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నది. పన్నుల పోటుతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మథన పడుతుంటే, మరోవైపు దేశం ముందున్న ఆర్థిక సంక్షోభం మరింత భయం గొలుపుతున్నది. ప్రధాని మోదీ అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాల మూలంగా దేశం ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా మారింది. ద్రవ్యలోటు పెరిగిపోతున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. విదేశీ రుణం తడిసిమోపెడయింది. విదేశీ మారక ద్రవ్యం వేగంగా హరించుకుపోతున్న నేపథ్యంలో మన దేశానికి శ్రీలంక గతి పడుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మోదీ ఆర్థిక విధానాలలో నిలకడ లేకపోవడంతో విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దేశ పతార దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి ఒక్కరోజులో వచ్చి పడింది కాదు. మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం క్రమంగా ఊబిలోకి దిగజారిపోతున్నది. మోదీ అధికారం చేపట్టే నాటికి దేశ ఆర్థిక రంగం సుస్థిరంగానే ఉంది. జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతం వద్ద ఉంది. మోదీ పాలన మూలంగా 2020కి 4.2 శాతానికి పడిపోయింది. మోదీ ప్రధాని అయిన తర్వాత కొన్నేండ్లపాటు అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా తగ్గాయి. తద్వారా కేంద్ర ఖజానాకు కొన్ని లక్షల కోట్ల మొత్తం ఆదా అయ్యింది. అయినా కూడా కేంద్రం అప్పులు భారీ ఎత్తున పెరిగాయి. ఆ ఆదాయంతోగానీ, ఈ అప్పులతోగానీ దేశంలో ఒక భారీ సాగునీటి ప్రాజెక్టు కట్టింది లేదు. అంతర్జాతీయస్థాయి కర్మాగారాన్ని నిర్మించింది లేదు. పైగా, అర్ధరాత్రి నోట్లరద్దు, ఆకస్మిక లాక్డౌన్ వంటి అపసవ్య విధానాల వల్ల ప్రజలు నానా కష్టాలు పడ్డారు. జీఎస్టీని కూడా కేంద్రం సరిగా అమలు చేయలేదు. రాష్ర్టాలను నమ్మించి బోర్లేయడంతో పాటు, జనంపై పన్నుల భారం పెంచింది.
మోదీ వ్యవహార సరళి గమనిస్తే దేశం ఈ ఆర్థిక దుస్థ్థితి నుంచి గట్టెక్కుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికా వంటి అగ్ర దేశాలైనా, శ్రీలంక వంటి బడుగు దేశాలైనా – ఆర్థిక సంక్షోభానికి కారణాలు పాలకులు అనుసరించే విధానాలలోనే ఉంటాయి. ఇప్పుడు మన దేశ పరిస్థితీ అంతే. దేశాన్ని ఆర్థికంగా వృద్ధి చేయడంపై దృష్టి సారించకుండా, సామాజిక విద్వేషాలను రెచ్చగొడుతూ, సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక వేత్తల సూచనలను గౌరవించకుండా ఒంటెత్తు పోకడలు అనుసరించారు. క్యాబినెట్ సహచరులను, ప్రతిపక్షాలను, ముఖ్యమంత్రులను ఖాతరు చేయలేదు. ఎన్నికల సందర్భంగా ఉద్వేగాలను రెచ్చగొట్టి గెలిస్తే చాలనే స్థాయికి పాలకులు దిగజారిన ఫలితమే ఈ ఆర్థిక సంక్షోభం. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు, మేధావులు, కార్మికులు, కర్షకులు తదితర వర్గాలన్నీ ఏకతాటిపై నిలిచి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్ప ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడం సాధ్యం కాదు. సకల వర్గాలు ఈ దిశగా అడుగులు వేయాలి.