విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం 132 స్టడీ సర్కిళ్ల ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జిల్లాకు నాలుగు చొప్పున మొత్తం 33 జిల్లాల్లో ప్రారంభించనున్న ఈ స్టడీ సర్కిళ్లు విద్యార్థులకు, ఉద్యోగార్థులకు గొప్ప అండగా నిలువనున్నాయి. వీటిని కేవలం మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల శిక్షణకే పరిమితం చేయకుండా.. వివిధ రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లతోపాటు, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలకూ సిద్ధమయ్యేలా అభ్యర్థుల్లో నైపుణ్యాలను పెంచే భరోసా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించటం ముదావహం. విద్యార్థుల సహజ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని ఏ రంగంలోకి వెళ్తే రాణించగలరన్న మార్గనిర్దేశకత్వాన్ని కూడా ఈ స్టడీసర్కిళ్లు అందించనున్నాయి. రానున్న కాలంలో తెలంగాణ యువతరానికి ఇవి దిక్సూచిగా నిలుస్తాయనటంలో సందేహం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చాలామంది విద్యార్థులు కెరీర్ పరంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ఇంటర్, డిగ్రీ తర్వాత ఏ దిశగా వెళ్తే జీవితంలో స్థిరపడవచ్చు అనే విషయంలో దిశానిర్దేశం కొరవడి చిన్నపాటి పనులకే పరిమితమయ్యేవారు అనేకమంది. వీరిలో ప్రతిభావంతులు, కష్టపడి చదివే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఈ విధంగా ఈ యువతీయువకుల ప్రతిభా కౌశలాలు పూర్తి గా వికసించకపోవటం వల్ల అది వారికేకాదు, సమాజానికీ తీరని నష్టం చేస్తుంది. ఈ లోటును తీర్చేలా విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చే కేంద్రాలనుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటం హర్షణీయం. సివిల్ సర్వీసెస్ ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు హైదరాబాద్లో విడిగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటుచేయనుండటం కూడా ఆయావర్గాలకు ఎంతో మేలు చేయనున్నది.
విద్యతోనే భవిష్యత్ తరాలు నిర్మాణమవుతాయి. కాబట్టే, విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచీ ప్రాధాన్యం ఇస్తున్నది. వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటుచేసి వాటిల్లో ఉన్నత ప్రమాణాలతో బోధన జరిగేలా చూస్తున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద వేల కోట్ల నిధులతో బడుల ముఖస్వరూపాన్నే మార్చివేసేలా మౌలిక సదుపాయాలను పెంపొందించింది. మధ్యాహ్న భోజన పథకంలో, హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన అనే విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని తాజాగా నిర్ణయించింది. వీటన్నింటి ఫలితంగానే నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొనే పరిస్థితి వచ్చింది. ఉద్యోగాల విషయంలోనూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారుబాటలు వేసేలా స్టడీ సర్కిళ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనుండటం.. తెలంగాణ యువత పట్ల రాష్ట్ర ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనం.