‘మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్లు గడప దాటవన్నట్లు’గా కేంద్ర ప్రభుత్వ మాటలు, చేతలలో హస్తిమశకాంతరం కనిపిస్తున్నది. ఆత్మనిర్భర్, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, ముద్ర, నమామి గంగే.. మొదలైనవన్నీ కూడా పేర్లు ఘనం, లోన డొల్ల. ఉద్యోగకల్పన వంటి కీలకరంగం తీసుకుంటే మోదీ సర్కారు వైఫ ల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏటా ఏకంగా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తానని యువతలో ఆశలు రేపి, వారి చేత ఓట్లు వేయించుకొని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
కానీ, రెండు కోట్లు కాదు కదా.. అరకోటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో 8.72 లక్షల ఖాళీలున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో 3.64 లక్షల ఖాళీలున్నాయి. కేంద్రం ప్రాయోజిత పథకాలైన ‘నేషనల్ హెల్త్ మిషన్’ వంటి ప్రాజెక్టుల్లోనూ వేల పోస్టులు సిబ్బంది కోసం ఎదురుచూస్తున్నాయి.
ఓ వైపు దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. నిరుద్యోగ రేటు పట్టణాల్లో 9.22 శాతం, గ్రామాల్లో 7.18 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా తీసుకుంటే మార్చి నెలలో ఇది 7.6 శాతం కాగా, ఏప్రిల్కు 7.83 శాతానికి ఎగబాకింది. అసలే రెండేండ్ల పాటు యావత్దేశం కరోనా బారిన పడి అల్లాడిపోయింది. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారు. అయినా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.
గ్రామీణ పేదలకు అంతో ఇంతో ఆసరాగా నిలుస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి.. ఇంతటి సంక్షోభ సమయంలో, ఈసారి బడ్జెట్లో నిధులను తగ్గించిందంటే బీజేపీ ప్రభుత్వానికి హృదయం అనేది లేదని అర్థమవుతున్నది. ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాల్లో కూడా వేల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయటం లేదు. గంగానది పునరుజ్జీవనం పేరుతో చేపట్టిన నమామి గంగే ప్రాజెక్టులో కూడా సరైన సంఖ్యలో సిబ్బంది లేరంటే ఆ నదిను కాపాడటంపై మోదీకి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో తెలుస్తున్నది.
ఉద్యోగాలే కాదు.. ఏ రంగం తీసుకున్నా ఇదే తీరు. ఎండలు మం డిపోతుంటే జనం ఫ్యాను పెట్టుకుందామంటే అనేక రాష్ర్టాల్లో కరెంటుకు కటకట నెలకొన్నది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, యూపీ, ఏపీ, కేరళ, బీహార్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, హర్యానా తదితర రాష్ర్టాలు తీవ్రమైన కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా యి. ఏప్రిల్లో దేశవ్యాప్తంగా కరెంటు డిమాండు-సరఫరాలో 188 కోట్ల యూనిట్ల అంతరం నమోదైంది. దీనికి కారణం.. విద్యుదుత్పత్తి కేంద్రాలకు తగినంత బొగ్గు రవాణా జరగకపోవడం.
ఇందుకు దేశంలోని బొగ్గుక్షేత్రాల్లో వర్షాలు పడటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతులు తగ్గటం వంటి కారణాలు చెప్పి కేంద్రం తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నది. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టున్నది. ఈ సమస్యలు నిజమే అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు ఎందుకు లేవు? అంటే కేంద్రానికి ముందుజాగ్రత్త లేకపోవటమే తప్ప మరే కారణం కాదని దీన్ని బట్టి తేలుతున్నది. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసినట్లుగా ‘దేశంలో అన్నింటికీ కొరతే.. దానికి మూలం.. ప్రధాని మోదీకి విజన్ కొరత’.