‘విద్యుత్ వాహనాలు, ఇంధన నిల్వ’ విధానాన్ని ప్రకటించిన సందర్భంగా.. 2030లోపు 400 కోట్ల డాలర్ల (రూ.30,506 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాలని, 1.2 లక్షల ఉద్యోగాలను కొత్తగా సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం అమల్లోకి వచ్చి రెండేండ్లు కూడా పూర్తి కాకపోయినా, లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది తెలంగాణ. రూ.1,144 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద త్రిచక్ర విద్యుత్ వాహనాల పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయటానికి అమెరికా కంపెనీ బిలిటీ ముందుకొచ్చింది. దీనిద్వారా కొత్తగా మూడువేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. విద్యుత్ వాహనాల తయారీకి తెలంగాణ కేంద్రబిందువు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
వాహన కాలుష్యం, భూతాపం, పర్యావరణ సమస్యల దృష్ట్యా శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు తీవ్రంగా కసరత్తు జరుపుతున్నాయి. అంతర్జాతీయ సదస్సులు దీనిపై తీర్మానాలు చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా నింగినంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు (ఈవీలకు) డిమాండ్ పెరుగుతున్నది.
ఈ క్రమంలోనే తెలంగాణ 2020 అక్టోబర్లో రాష్ట్ర విధానాన్ని ప్రకటించింది. అప్పటికి దేశంలో ఢిల్లీ, గుజరాత్ మాత్రమే ఈవీ పాలసీకి రూపకల్పన చేశాయి. తెలంగాణ పాలసీ ఆ రాష్ర్టాలే కాదు, కేంద్రప్రభుత్వ విధానం కన్నా మెరుగ్గా ఉంది. ఈవీలకు రిజిస్ట్రేషన్ ఫీజును, రోడ్ట్యాక్స్ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. పరిశ్రమలకు భారీ ఎత్తున పెట్టుబడి, పన్ను, విద్యుత్ ఛార్జీల రాయితీలను ఇచ్చింది. కోట్ల కొద్ది డబ్బును కోల్పోతున్నప్పటికీ ఈవీల వాడకాన్ని ప్రోత్సహించటానికి సిద్ధపడింది. దీనివల్ల ఈ పాలసీని ప్రకటించిన రోజే రూ.3,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈవీల వినియోగంలో చార్జింగ్ అత్యంత కీలకమైనది. దీనిని గుర్తించిన ప్రభుత్వం చార్జింగ్ స్టేషన్లను పెంచటానికి చర్యలు తీసుకుంది. డిస్కం కార్యాలయాలు, విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర వీటిని ఏర్పాటు చేయటంపై టీఎస్ రెడ్కో సంస్థ అధ్యయనం చేస్తున్నది. ఈ స్టేషన్లకు సబ్సిడీ ధరలపై కరెంటు సరఫరా చేయటానికి ప్రభుత్వం సిద్ధపడింది. మరోవైపు ఈవీ తయారీ కంపెనీల కోసం, బ్యాటరీ తయారీ పరిశ్రమల కోసం వందల ఎకరాల భూమిని కేటాయించి ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసింది.
మహీంద్రా అండ్ మహీంద్ర, గ్రావ్టన్ మోటార్స్, వన్మోటో, ఈటో మోటార్స్, ఒలెక్ట్రా, ప్యూర్ ఎనర్జీ తదితర కంపెనీలు ఇప్పటికే రాష్ట్రంలో తమ పరిశ్రమలను నెలకొల్పాయి. ఈ విధమైన బహుముఖ కార్యాచరణ ఫలితంగానే తెలంగాణ నేడు విద్యుత్ వాహనాల రంగంలోనూ దూసుకెళ్తున్నది. రాష్ర్టాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఎంత పకడ్బందీగా, చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదో ఈ ఒక్క రంగాన్ని తీసుకొని అధ్యయనం చేసినా తెలుస్తుంది.