ఇతర భాషలు మాట్లాడే రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిషు బదులు పరస్పరం హిందీలోనే మాట్లాడుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. ఏ భాషలో మాట్లాడుకోవాలనేది ఎవరికి వారు నిర్ణయించుకుంటారు. కానీ ఫలానా భాషలోనే మాట్లాడుకోవాలంటూ కేంద్ర హోంమంత్రి స్థానంలో ఉండి సూచించడం బాధ్యతాయుతంగా లేదు. రెండు హిందీయేతర రాష్ర్టాలు- ఉదాహరణకు తమిళనాడు, కేరళ- పరస్పరం హిందీలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవాలనడం ఆమోదనీయమా, ఆచరణ సాధ్యమా! కేంద్రమంత్రి మాట్లాడింది, పార్లమెంటు అధికార భాషా కమిటీ భేటీ అయిన సందర్భమే కావచ్చు. ఆయన ఈ సందర్భాన్ని హిందీయేతర ప్రాంతాల వారి ఆందోళనలను తొలగించడానికి ఉపయోగించుకుంటే బాగుండేది.
హిందీ గొప్ప భాష అనడంలో ఎవరికీ సందేహాలు లేవు. ఆ లెక్కన చూస్తే ఏ భాషా తక్కువది కాదు. కానీ ఇంగ్లిష్కు ప్రత్యామ్నాయంగా హిందీని మాత్రమే స్వీకరించే పరిస్థితి దేశంలో లేదు. హిందీయేతర ప్రాంతాల వారు తమ మాతృభాషను కాపాడుకుంటూనే, ఇంగ్లీషు ప్రాధాన్యాన్ని గుర్తించి, తమ అవసరాల మేరకు వాడుకుంటున్నారు. ప్రపంచీకరణ పరిణామాలు, సాంకేతికాభివృద్ధి నేపథ్యంలో దేశాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. ఐటీ, బయోటెక్నాలజీ మొదలుకొని అనేక రంగాలలో విజ్ఞాన సముపార్జనకు ఇంగ్లిష్ పరిజ్ఞానం అత్యావశ్యకం. సాధారణ ఉపాధి కోసం కూడా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు తప్పనిసరైన కాలమిది. ఈ పరిస్థితులలో హిందీని ఇంగ్లిష్కు ప్రత్యామ్నాయంగా మార్చాలని కనుక కేంద్ర హోంమంత్రి నిజంగా అనుకుంటే, ఆయన ఆలోచనలు, వ్యాఖ్యలు ఇంత అల్పంగా ఉండేవి కావు. హిందీ భాషాభివృద్ధికి ఆయన కార్యాచరణ మరో విధంగా ఉండేది. కానీ ఆయన వ్యాఖ్యల వల్ల, భాష పేరిట పెత్తనం సాగించేందుకు లేదా రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ పాలకులు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుత బీజేపీ పాలకుల వ్యవహారశైలితో దేశంలో ఇలాంటి వాతావరణమే నెలకొంది.
ఇంతకాలం మతం పేర విభేదాలను పెంచిన బీజేపీ పాలకులు- మరో రెండేండ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో- భాష పేరిట రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. హిందీ భాషను ఏ రాష్ట్ర ప్రజలూ వ్యతిరేకించడం లేదు. కానీ హిందీని రుద్దే ప్రయత్నాల వెనుక ఆధిపత్య రాజకీయాలు ఉన్నాయి. అందువల్లనే ఆదినుంచీ హిందీ భాష సమైక్యతకు బదులుగా అనైక్యతకు దారి తీస్తున్నది. హిందీయేతర రాష్ర్టాల నుంచి కొన్ని దశాబ్దాల పాటు అభ్యంతరాలు వ్యక్తం అయిన తరువాత కూడా హిందీలో మాట్లాడాలంటూ సూచించడం దేశ సమైక్యతకు ప్రమాదకరం. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం కేంద్ర పాలకులకు తగదు. ఇప్పటికైనా కేంద్రమంత్రి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి. హిందీయేతర రాష్ర్టాల ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించాలి.