ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభిస్తే.. మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కారు దానిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ముఖ్యంగా విపక్షాలను, విమర్శకులను బెదిరించటానికి, వారి ఆర్థిక వనరులను దెబ్బతీయటానికి సీబీఐ, ఈడీ తదితర సంస్థలను ఇష్టారీతిన వినియోగించుకుంటున్నదన్న ఆరోపణలున్నాయి. దీనికి తాజా ఉదాహరణ.. శివసేన కీలకనేత సంజయ్ రౌత్ ఆస్తుల జప్తు వ్యవహారం. బీజేపీతో స్నేహాన్ని వదులుకొని కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి శివసేన ‘మహా వికాస్ ఆఘాడీ’ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచే ఆ మూడుపార్టీలపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఇప్పటికే ఎన్సీపీ నేతలపై పలు కేసుల్లో దర్యాప్తులు జరిగాయి. మంత్రులూ అరస్టై జైలు పాలయ్యారు. ఇప్పుడిక శివసేన నాయకులకు వేధింపు మొదలైనట్లుంది. ఇదంతా తమ ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీని గద్దె ఎక్కించటానికేనని కూటమి నేతలు చెబుతున్నారు.
బీజేపీతో జతకట్టని లేదా ఆ పార్టీతో సయోధ్య కుదుర్చుకోని పార్టీలపై, ప్రభుత్వాలపై కేంద్రసర్కారు అదేపనిగా దాడులకు దిగుతున్నదనటానికి లెక్కలేనన్ని నిదర్శనాలున్నాయి. రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్కు మధ్య వివాదాలు పెరిగి సంక్షోభం ముదరగానే, గెహ్లాట్ సోదరుడిపై ఐటీ, ఈడీ కేసులు పెట్టారు. అక్కడి కాంగ్రెస్ సర్కారును కూల్చటానికే కేంద్రం ఈ వేధింపులకు దిగిందన్న ఆరోపణలు వచ్చాయి.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్నూ కేంద్రం వదిలిపెట్టలేదు. సీబీఐ, ఈడీ వరుసగా కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపించాయి. ఈ దర్యాప్తులు, కేసుల ప్రహసనంలో కొట్టొచ్చినట్లు కనిపించే మరో అంశం.. ఎన్నికల సమయంలో ఇవి మరింత పెరగటం. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నా అక్కడ బీజేపీ ప్రత్యర్థులపై కేంద్ర సంస్థలు మూకుమ్మడి దాడులు జరుపుతుంటాయి. ఇందుకు పశ్చిమబెంగాల్లో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నుంచి తమిళనాడులో స్టాలిన్ కుటుంబసభ్యుల వరకూ బోలెడన్ని దృష్టాంతాలున్నాయి.
చర్యకు ప్రతిచర్యలాగా ఆయారాష్ర్టాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈడీ, సీబీఐ తదితర సంస్థల అధికారులపై పలు ఆరోపణలతో కేసులు పెడుతున్నాయి. కేంద్రం మమ్మల్ని సతాయిస్తే, తిరిగి మేమూ అదే పని చేస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ర్టాల్లో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
దేశంలోని సమాఖ్య వ్యవస్థ దెబ్బతినే ప్రమాదకర పరిణామం ఇది. కేంద్రంపై రాష్ర్టాలు నమ్మకం కోల్పోతే దేశ సమైక్యతకే విఘాతం కలుగుతుంది. తక్షణ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఒంటెత్తు పోకడలకు పోతున్న మోదీ సర్కారు, దీర్ఘకాలంలో దేశానికి జరిగే నష్టాల్ని లెక్కలోకి తీసుకుంటున్నట్లు కనిపించటం లేదు. అందరూ ఖండించాల్సిన అవాంఛనీయ ధోరణి ఇది.