ఎన్నికలు సమీపిస్తున్న గుజరాత్కు కేంద్రం నిధుల వరద పారిస్తున్నది. గడిచిన ఆరు నెలల్లోనే రూ.80 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిణామం రెండు అంశాలను వెల్లడిస్తున్నది. ఒకటి, గుజరాత్లో బీజేపీ రెండు దశాబ్దాలుగా అమలుచేస్తున్న మత రాజకీయాలు ఆ రాష్ట్ర ప్రజలను ఇక ఎంతమాత్రమూ ఆకట్టుకోవటం లేదని. రెండు, సమాఖ్యస్ఫూర్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తి పక్షపాత దృష్టితో వ్యవహరిస్తున్నదని. ఇవి రెండూ కీలకమైన అంశాలే. మరో ఏడాదిన్నరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా వీటికి మరింత ప్రాధాన్యం ఉంది.
నరేంద్ర మోదీ 2014లో ప్రధాని పదవికి బీజేపీ అభ్యర్థిగా పోటీపడే నాటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్లో గొప్ప అభివృద్ధి జరిగిపోతున్నదని, గుజరాత్ మాడల్ను దేశమంతటా విస్తరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నిజంగానే జనం నమ్మి ఓట్లేసి ఆయనకు అధికారం కట్టబెట్టారు. కానీ, ఈ ఎనిమిదేండ్లలో గుజరాత్ మాడల్ అనేది ప్రచార ఆర్భాటపు డొల్లనే తప్ప, అక్కడ సారమేమీ లేదని దేశ ప్రజలందరికీ తెలిసొచ్చింది. గుజరాత్తో పలువర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడి ఉద్యమించటం ఈ సంగతిని ధ్రువపరిచింది. 20 ఏండ్లకు పైగా మైనారిటీ వ్యతిరేకతే కేంద్రంగా బీజేపీ జరిపిన ప్రచారం, రాజకీయం కూడా గుజరాతీల్లో ప్రభుత్వ వ్యతిరేకతను మరింత పెంచింది. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి కష్టంగానే ఉన్నది. గుజరాత్లో అధికారం కోల్పోవటం మోదీకి అవమానకరంగా పరిణమిస్తుంది. దీంతోనే అడ్డగోలుగా నిధులు పారిస్తున్నట్లున్నారు.
ఈ దేశాన్ని పాలించే కేంద్ర ప్రభుత్వం పరిధిలో అపారమైన ఆర్థిక వనరులుంటాయి. వాటిని పక్షపాతరహిత దృష్టితో సమాన అభివృద్ధిని సాధించేందుకు వీలుగా ఉపయోగించాలి. తద్వారా సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలి. కానీ, మోదీ హయాంలో దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నది. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కొత్త రాష్ట్రం కొత్త లక్ష్యాలను పెట్టుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే భుజం తట్టి ప్రోత్సహించాల్సింది పోయి, అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది కేంద్రం. రుణాలపై ఆంక్షలు, అనుమతులపై కొర్రీలు, నిధుల్లో మొండిచేయి, చివరికి ధాన్యం కొనుగోళ్లపైనా రాజకీయం చేసింది. బీజేపీ హయాంలో దేశం ఎన్నడూ లేని ఆర్థిక, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. వాటిని పరిష్కరించే సామర్థ్యం లేకపోగా, మరింత ఎగదోస్తున్నది ఆ పార్టీ. దీన్నించి దేశం బయటపడాలంటే ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాలి.