‘స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి.. సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయి!’ అంటూ స్వరాజ్యం సిద్ధించిన తొలినాళ్ళలోనే ఒక సినీ గీతం ద్వారా హెచ్చరించాడు మహా కవి శ్రీశ్రీ. ‘ఆకాశం అందుకొనే ధరలొకవైపు, అంతులేని నిరుద్యోగమింకొక వైపు…’ అంటూ దేశాన్ని పీడిస్తున్న జాడ్యాలను ఆనాటి గీతంలో వివరించాడు. స్వాతంత్య్ర దినోత్సవమంటే సంబరాలే కాదు, స్వాతంత్య్ర విలువలను అనుభవంలోకి తెచ్చుకోవడం. రాజ్యాంగ ఆశయాలను ఆచరణలోకి అనువదించుకోగలగడం. కానీ స్వాతంత్య్ర అమృతోత్సవాలను ప్రకటించిన మోదీ ప్రభుత్వం వాటిని కేవలం ప్రతీకాత్మకంగా మార్చి, స్వాతంత్య్ర లక్ష్యాలను విస్మరించింది. 75 ఏండ్ల తరువాత కూడా ఇంకా అవే జాడ్యాలు భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తుంటే ఇంకా ఎంతకాలమని ఉద్వేగాల స్వప్న లోకాల్లోనే విహరించగలం?
మన దేశాన్ని లౌకిక, గణతంత్రంగా రాజ్యాంగ పీఠికలోనే ప్రకటించుకున్నాం. ‘పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా…’ అంటూ సాగిన గీతాలాపనలోనే మన దేశ భిన్నత్వం గోచరిస్తుంది. మన దేశం రాష్ర్టాల సమాహారమని రాజ్యాంగమే స్పష్టం చేసింది. భిన్న ప్రాంతాలు, మతాలు, భాషాసంస్కృతులతోనే కదా మన దేశానికీ ఈ ఔన్నత్యం సమకూరింది. కానీ వైవిధ్యభరితమైన భారతానికి, సమాజాన్ని ఏకశిలా స్వరూపంగా భావించే కేంద్ర పాలకుల మనస్తత్వానికి పొసగడం లేదు. హిందీ భాషనే రుద్దాలనుకుంటే మరి మిగతా భాషల వారు ఆందోళన చెందరా? ప్రాంతీయ ఆకాంక్షలను పట్టించుకోకపోవడం రాజ్యాంగవిలువలను తుంగలో తొక్కడం కాదా? చట్టాల విషయంలో రాజ్యసభను బైపాస్ చేస్తే రాష్ర్టాల సమాఖ్య ఎలా అవుతుంది? ప్రధాని మోదీ ఎర్రకోట మీద సమాఖ్యతత్వమని తీపి పలుకులు పలికారు. కానీ ఆచరణలో రాష్ర్టాల అధికారాలను హరించివేస్తున్నారు. ప్రాంతీయ పక్షాలను ధనబలంతో, అధికారబలంతో అణగదొక్కుదామనుకుంటున్నారు.
స్వాతంత్య్రమంటే ఇంటింటా జండా ఎగరవేయడమనే నినాదంతో సరిపుచ్చకూడదు. స్వాతంత్య్రం అంటే సామాన్యుడు మూడు పూటలా తినడం. అన్ని వర్గాలకు సమానావకాశాలు లభించడం. అన్నదాతలు ‘మేం రైతులం’ అంటూ సగర్వంగా చెప్పుకోవడం. సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లే కాదు, కులవృత్తుల వారూ మేమూ నిపుణులమే అని తలెత్తుకొని నిలబడటం. స్వాతంత్య్రమంటే గ్రామాలు భాగ్యసీమలుగా విరాజిల్లడం! ప్రజలలో స్వాతంత్య్ర భావన శాసనాల ద్వారా రాదు. స్వాతంత్య్ర ఫలాలు సామాన్యులను చేరినప్పు డు వస్తుంది. స్వరాష్ట్రం సాధించుకున్న నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఈ దిశగానే సాగుతున్నది. సకల వర్గాలు సంతోషంగా ఉన్నప్పుడు- హర్ ఘర్మే తిరంగా అనే కాదు, హర్ దిల్ మే తిరంగా అంటూ నినదించగలం! అదే నిజమైన స్వాతంత్య్ర దినోత్సవం.