‘మన తల్లి అన్నపూర్ణ.. మన అన్న దానకర్ణ.. మన భూమి వేదభూమిరా తమ్ముడూ.. మన కీర్తి మంచుకొండరా/ డిగ్రీలు తెచ్చు కొని, చిప్ప చేత పుచ్చుకొని ఢిల్లీకి చేరినాము.. దేహీ దేహీ అంటున్నా ము..’ అంటూ 1980ల నాటి నిరుద్యోగ భారతాన్ని ఆవిష్కరిస్తుంది ‘ఆకలిరాజ్యం’లోని ఈ పాట. నాలుగు దశాబ్దాలు గడిచిన తర్వాత, ఇప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ మాటలు వింటే మళ్లీ ఈ పాటను గుర్తుచేసుకునే పరిస్థితి. అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోయిన ధరలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడితే, వారిని సస్పెండ్ చేసి, వాళ్ల నోళ్లు మూసి ఎట్టకేలకు చర్చకు అంగీకరించింది ప్రభు త్వం. అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదమే లేదని, అనేక దేశాలకన్నా మన పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆర్థిక ప్రగతి చక్రాలు పరిగెడుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఆర్థికరథం పరుగులు పెడుతుంటే.. గ్యాస్ సిలిండర్ ధర ఈ ఎనిమిదేండ్లలో మూడింతలు ఎందుకు పెరిగినట్టు? రూపాయి విలువ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఎందుకు పతనమైనట్టు? పెట్రోల్, డీజీల్ ధరలు వంద ఎందుకు దాటినట్లు? నిత్యావసరాల రేట్లు ఎందుకు ఆకాశాన్ని అంటినట్టు? వీటిలో ఏ ఒక్కదానికీ మంత్రి సమాధానం చెప్పలేదు. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఒడిదొడుకులకు లోనయ్యామన్నారు. కానీ, ఈ రెండూ వెలుగులోకి రాకముందే దేశ ఆర్థికవ్యవస్థ పతనోన్ముఖంగా సాగుతున్న విషయాన్ని మంత్రి కావాలనే మర్చిపోయారు. విపక్ష పాలిత రాష్ర్టాల మీద కేంద్రం ఓ వైపు రాజకీయదాడులు చేస్తూ మరోవైపు వాటి ఆర్థికమూలాల్ని దెబ్బతీస్తున్న ప్రస్తుత సమయంలో పుండు మీద కారం చల్లినట్లుగా.. జూలైలో జీఎస్టీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చిందని నిర్మల ప్రకటించారు. సెస్సుల పేరుతో రాష్ర్టాల పొట్టకొడుతున్నది చాలక జీఎస్టీ పరిహారం విషయంలోనూ కరోనాను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడింది మోదీ సర్కారు.
పెరుగు, పనీర్, తేనె వంటి వాటిపైనా జీఎస్టీ విధించటాన్ని ఆర్థిక మంత్రి సమర్థించుకుంటూ.. రాష్ర్టాలు కూడా భాగస్వాములుగా ఉండే జీఎస్టీ మండలి ఈ నిర్ణయం తీసుకున్నదని అనటం దివాలాకోరుతనమే. జీఎస్టీ మండలి నిర్ణయాలన్నీ కేంద్రం, బీజేపీ రాష్ర్టాలు కూడబలుక్కొని ఏకపక్షంగా తీసుకుంటున్నాయని, తమ అభిప్రాయానికి ప్రాధాన్యతే ఉండటం లేదని పలు విపక్ష పాలిత రాష్ర్టాలు వాపోతున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులను ఎంతలా బాధపెడుతున్నాయో యూపీకి చెందిన ఆరేండ్ల బాలిక ప్రధాని మోదీకి రాసిన లేఖ వెల్లడిస్తుంది. పెన్సిల్, రబ్బరును పోగొట్టుకుంటే అమ్మ కొడుతున్నదని, వాటి ధరలు ఇంతగా ఎందుకు పెరిగాయని మోదీని ఆ చిన్నారి ప్రశ్నించింది. దీనికి సూటిగా సమాధానం చెప్పలేక, ప్రధాని మీద ఆ బాలికకు గొప్ప నమ్మకం ఉన్నదని, అందుకే ఎవరికీ కాకుండా ఆయనకే లేఖ రాసిందని నిర్మల సమాధానం ఇవ్వటం ‘నవ్విపోదురు గాక..’ అన్నట్లుంది. ఈ విధమైన మాయమాటలు కట్టిపెట్టి, ప్రజల సమస్యల పట్ల కించిత్తయినా ఆవేదన ఆర్థికమంత్రి వ్యక్తం చేసి ఉంటే ఆమెకూ, ప్రభుత్వానికి హుందాగా ఉండేది.