తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది కాబట్టి, ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం ప్రకటించడం ఆశ్చర్యంగా ఉన్నది. అదే నిజమైతే, జమ్ముకశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన ఎలా సాధ్యమైంది? అని అడిగితే సమాధానం ఉండదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవసరమైన చోట ఒక నీతి, అవసరం లేని చోట మరో నీతి. జమ్ముకశ్మీర్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న జమ్ములో సీట్లను పెంచుతారు. కానీ, తెలంగాణలో, ఏపీలో ఇప్పుడున్న నియోజకవర్గాల్లోనే బీజేపీకి అభ్యర్థులకు కరువు ఉంది కాబట్టి పెంచితే ఆ పార్టీకి లాభం లేకపోగా, స్థానిక పార్టీలు ప్రయోజనం పొందుతాయి కాబట్టి పెంచరు. 140 కోట్ల మందిని పాలించే కేంద్రప్రభుత్వం ఇంత సంకుచితంగా వ్యవహరించవచ్చునా? స్వీయ రాజకీయ ప్రయోజనాలే తప్ప దేశ ప్రయోజనాలు పట్టవా?
తెలంగాణలో ఉన్న అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు, ఏపీలో ఉన్న సీట్లను 175 నుంచి 225కి పెంచాలని ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం’ స్పష్టంగా పేర్కొంటున్నది. కేంద్రానికి బాధ్యత, చిత్తశుద్ధి ఉంటే.. చట్టంలో ఉన్న ఈ నిబంధనను 2014లోనే అమలు చేయాల్సిన పని. ఎందుకంటే, దీనిపై ఎవరికీ అభ్యంతరాలు లేవు సరికదా.. ఇరు రాష్ట్రప్రభుత్వాలు పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. తెలంగాణ నుంచైతే ప్రభుత్వపరంగానే గాక, టీఆర్ఎస్ పరంగానూ అనేక సార్లు కేంద్రానికి విన్నవించటం జరిగింది. అయినా కూడా కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇదే మోదీ సర్కారు.. తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను ఏపీలో కలుపాలంటూ ‘ఏపీ పునఃవ్యవస్థీకరణ చట్టం’లో ఉన్న నిబంధనను మాత్రం తొలి క్యాబినెట్ భేటీలోనే ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినా బేఖాతరు చేసింది. అదే చట్టంలో ఉన్న నియోజకవర్గాల పెంపు అంశాన్ని మాత్రం ఎనిమిదేండ్లుగా నాన్చుతున్నది.
శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాలను నిర్ణీత కాలవ్యవధి ప్రకారం పునర్విభజించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నది. పెరిగే జనాభాకు, మారే సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఇది అవసరం. ప్రజాస్వామ్యాన్ని ఎప్పటికప్పుడు సజీవంగా నిలుపుకోవటానికీ ఇది తప్పనిసరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971 జనాభా లెక్కల ప్రకారం.. అసెంబ్లీ సీట్ల సంఖ్యను 294గా నిర్ణయించారు. అప్పటి జనాభా 4.35 కోట్లు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మొత్తం జనాభా 9.28 కోట్లు. జనాభా రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ, నేటికీ ఇరు రాష్ర్టాల అసెంబ్లీల సీట్ల సంఖ్య మొత్తంగా 294గానే ఉంది. ఇది ఏ విధంగా సమర్థనీయం? అసెంబ్లీ సీట్ల పెంపు వల్ల రెండు రాష్ర్టాలు సంతోషిస్తాయే తప్ప ఎవరికీ అభ్యంతరం ఉండదు. కాబట్టి సంకుచిత వైఖరి విడనాడి విచక్షణతో కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాలి.