కృష్ణా నదీతీరాన, ఆచార్య నాగార్జునుడు నడయాడిన చోట- నల్గొండ జిల్లాలో ఏర్పాటైన ‘బుద్ధవనం’ తెలంగాణను సరికొత్తగా ప్రపంచ పటంపై ఆవిష్కరిస్తున్నది. పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించిన ఈ బుద్ధవనం ప్రపంచస్థాయి బౌద్ధ యాత్రాస్థలాల్లో ఒకటిగా వినుతికెక్కనున్నది. 274 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వంద అడుగుల ఎత్తున్న మహా స్తూపంతో, 200 అడుగుల వెడల్పు ప్రదక్షిణ పథంతో, వేలాది శిల్పాలతో బుద్ధవనం రమణీయంగా రూపుదిద్దుకున్నది. జాతక కథలను తెలిపే శిల్పాలతోపాటు వివిధ దేశాలలోని బౌద్ధస్తూపాల ప్రతిరూపాలను ఇక్కడ తీర్చిదిద్దడం విశేషం. బుద్ధుడి అష్టాంగ మార్గానికి సంకేతంగా- బుద్ధచరిత వనం, జాతకవనం, ధ్యానవనం, స్తూపవనం, మహాస్తూపం, విద్యాకేంద్రం మొదలైనవాటిని నెలకొల్పడం వల్ల బుద్ధవనం యాత్రాస్థలంగానే కాకుండా, మానవ వికాస కేంద్రంగా విరాజిల్లుతుందని భావించవచ్చు.
‘కులవర్ణ సంకీర్ణ కలహాల నిర్జించి/ బోధిసత్వుని ధర్మ బోధనల నేర్పించె/ శ్రీగిరి చైత్యమ్మురా!/ తెలగాణ చైతన్యమును చాటెరా! … శ్రీ వైష్ణవుల భక్తి చిందు గీతాలలో/ బసవన్న శివతత్వ పారవశ్యములోన/ ఉర్రూతలూగిందిరా!/ తెలగాణ వెల్లువై పొంగిందిరా!’ అంటూ రావెళ్ళ అభివర్ణించినట్టు- స్వీయ అస్తిత్వాన్ని సంతరించుకున్న తెలంగాణ మళ్ళీ తన సహజమైన సమభావన సంస్కృతిని ప్రస్ఫుటిస్తున్నది. స్వతంత్ర భారత చరిత్రలో యాదాద్రి అంతటి ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలలతో పునఃనిర్మించిన దాఖలా లేదు. మరోవైపు వేములవాడ శైవక్షేత్రం కూడా సువిశాలంగా రూపుదిద్దు కుంటున్నది. ముస్లింలకు, క్రైస్తవులకు కూడా ప్రభుత్వం అన్ని విధా లా అండగా నిలబడి భరోసానిస్తున్నది. గురుకులాల నుంచి షాదీముబారక్ వరకూ ప్రతి దశలో చేదోడువాదోడుగా ఉంటున్నది. వైదికంతోపాటు జానపద సంస్కృతికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టం కడుతున్నది. బతుకమ్మ పండుగకు, మేడారం, కొమురవెల్లి మొదలైన జాతరలకు తెలంగాణ వచ్చిన తర్వాతనే గొప్ప గుర్తింపు, వైభవం దక్కాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాల వల్ల వివిధ రాష్ర్టాలలో మత విద్వేషాలు చెలరేగుతుంటే, ప్రశాంత తెలంగాణ సర్వమత సమభావనతో, అభివృద్ధి పథంలో సాగుతున్నది. దేశంలోని ఆలోచనాపరులు, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులకు తెలంగాణ సరికొత్త ఆశను కలిగిస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వానికి అసలైన ప్రతీకగా మారిన తెలంగాణ భారతదేశానికే దిశానిర్దేశం చేస్తున్నది. లోక్సభకు, శాసనసభకు ఎన్నికలు సమీపించేకొద్దీ విద్వేష శక్తులు రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. సామాజిక మాధ్యమాలు తదితర వేదికల ద్వారా అబద్ధాలతో కూడిన విష ప్రచారాలను చేపట్టవచ్చు. వారి దుష్ప్రచారాలకు తెలంగాణ ప్రజలు లోనుకాకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం సామాజిక శాంతిని కాపాడుకోవాలె.