తెలంగాణ పునర్నిర్మాణ పతాకదృశ్యం నూతన సచివాలయం ప్రారంభోత్సవం. ఆ ధవళ వర్ణ సౌధం రాళ్లు, ఇటుకలు, సిమెంటుతో కూడిన భవనం మాత్రమే కాదు. నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని గగనతలాన నిలబెట్టిన సమున్నత పతాకం. తరతరాల వివక్షపై మనం సాధించిన విజయాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన ఘన సౌధం. ‘మేం లేకపోతే మీకు పాలించుకోవటం చేతకాదు’ అని నిస్సిగ్గుగా పలికిన వారికి చెంపపెట్టు వంటి సమాధానం అది. మన సామర్థ్యానికి, సౌందర్యతృష్ణకు, అంకితభావానికి, ఆదర్శాలకు, మన జీవితాల్లో పాటించే మత సామరస్యానికి ప్రతీక నూతన సచివాలయం. ఒక కాళేశ్వరం, ఒక యాదాద్రి, ఒక అంబేద్కర్ విగ్రహం, ఇప్పుడు సెక్రటేరియట్. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు, విభిన్న రంగాలపై ఆయనకున్న అపార జ్ఞానానికి నిదర్శనాలు ఈ మైలురాళ్లు.
కొత్త సెక్రటేరియట్ను నిర్మిద్దామని సీఎం కేసీఆర్ అన్నప్పుడు సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లే ఎక్కువ. ‘ఇప్పుడున్నది సరిపోదా? కొత్తది దేనికి? ఎందుకీ వృథా వ్యయం?…’ ఈ తరహా ప్రశ్నలు అనేకం. కానీ, ఇప్పుడు కళ్ల ముందు ఆవిష్కృతమైన సచివాలయాన్ని చూసిన వాళ్లందరూ ఆశ్చర్యంతో మరో మాట కూడా మాట్లాడటం లేదు. ఆ సౌందర్యాన్ని, ఆ రాజసాన్ని, ఆ ఠీవీని చూసి, మనసు నిండా అద్భుతం అనే భావన పరుచుకున్నప్పుడు ఇక ప్రశ్నలకు, సందేహాలకు తావెక్కడ? కేసీఆర్ ఆలోచనల్లోని గొప్పదనం అవి సాకారమైన తర్వాతగానీ సందేహజీవులకు అర్థం కాదు. స్వరాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఆయన భుజాన వేసుకున్నప్పటి నుంచీ నేడు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన దాకా.. ఈ సుదీర్ఘ ప్రస్థానం అంతా దీనినే రుజువు చేస్తున్నది.
28 ఎకరాల విస్తీర్ణంలో హిందూ, దక్కనీ సంప్రదాయాల మేలుకలయికగా నిర్మితమైన సచివాలయం సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య వారధి వంటిది. నిర్మాణ రంగంలో, శైలిలో, వాస్తులో తెలంగాణ అవిచ్ఛిన్న వారసత్వాన్ని ఈ సౌధం కొనసాగిస్తున్నది. మరోవైపు, పాలనారంగంలో వచ్చిన అత్యాధునిక మార్పులకు అద్దం పడుతున్నది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలనూ పాలనాకేంద్రంతో అనుసంధానించేలా సచివాలయంలో అనేక సాంకేతికతలు కొలువయ్యాయి. భవనం పైన పడిన ప్రతి వర్షపు నీటి చుక్కనూ ఒడిసిపట్టి, ఆ నీటిని వినియోగించేలా ఏర్పాట్లు చేయటం ప్రకృతి పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం తొలి నుంచీ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. దీనివల్లే సచివాలయానికి ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ గోల్డెన్ సర్టిఫికేట్ ఇచ్చి సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వానికి గుండెకాయ వంటి ఈ మహాసౌధానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ పేరు పెట్టటం ముఖ్యమంత్రి కేసీఆర్ రాజనీతిజ్ఞతకు తార్కాణం. ఇప్పటికే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ విశ్వమానవుడికి సమున్నత నీరాజనం అర్పించింది తెలంగాణ. రూపంలోనూ, సారంలోనూ తెలంగాణ దేశానికి రోల్మాడల్గా నిలుస్తున్నది.