తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఆకుపచ్చటి తెలంగాణగానే గాక ఆరోగ్య తెలంగాణగానూ అవతరించింది. తెలంగాణ డయాగ్నస్టిక్స్కు ‘నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కాలిబరేషన్ లాబొరేటరీ’ ధ్రువీకరణ లభించటం దీనికి తాజా నిదర్శనం. పేదలకు కార్పొరేట్ దవాఖాన స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించటమేగాక ఆరోగ్య పరీక్షలను అందుబాటులో ఉంచాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ డయాగ్నస్టిక్స్ను ప్రారంభించింది. ఏడాది వ్యవధిలోనే వీటి సంఖ్య 20కి పెంచి, ‘హై ఎండ్ సెంట్రల్ ల్యాబరేటరీలను’ ఏర్పాటు చేసింది. ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో వేలు చెల్లిస్తేగానీ చేయని పరీక్షలను వీటిల్లో ఉచితంగా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ ఆరోగ్య పరీక్ష కేంద్రాలలో దాదాపు ఆరున్నర కోట్ల పరీక్షలు జరిగాయంటే ఈ సేవలు ఎంతగా ప్రజాదరణ పొందాయో తెలుస్తున్నది.
ఉమ్మడి ఏపీలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో వైద్యరంగం ఒకటి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ రంగాన్ని ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అప్పటికే ఉన్న దవాఖానలను యుద్ధప్రాతిపదికన మెరుగుపర్చి, అత్యాధునిక సౌకర్యాలు కల్పించటమేగాక, ప్రభుత్వ ఆరోగ్యరంగాన్ని భారీ ఎత్తున విస్తరించారు. ఫలితంగా హైదరాబాద్, జిల్లా కేంద్రాలు, మండలాల్లో ఉన్న దవాఖానలు కొత్త సదుపాయాలతో అలరారాయి. బస్తీ, పల్లె దవాఖానలను వందల సంఖ్యలో నెలకొల్పారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం రాజధానికి వచ్చే ప్రజల సంఖ్య పెరుగుతుండటంతో నగరానికి నలువైపులా నాలుగు ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్) దవాఖానలను భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేసీఆర్ కిట్స్ విజయం తెలంగాణ ఆరోగ్య రంగానికి ఒక కేతనం వంటిది. కేసీఆర్ కిట్స్ వల్ల ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగటమేకాదు, అనవసర సిజేరియన్లు తగ్గిపోయాయి.
కంటివెలుగు, ఉచిత డయాలిసిస్ సెంటర్లు, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్, తెలంగాణ డయాగ్నస్టిక్స్, కేసీఆర్ కిట్స్.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆరోగ్య పథకాల జాబితా ఎంతో పెద్దది. పరీక్ష, చికిత్సలతోపాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణపైనా ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. గర్భిణీలకు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా బాలామృతం, ఆరోగ్యలక్ష్మి పథకాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గిరిజన మారుమూల ప్రాంతాలలోనూ పటిష్ఠమైన చర్యలను తీసుకుంటున్నది. దీనివల్లే అడవి బిడ్డల అకాల మరణాలు ఆగిపోయాయి. తెలంగాణ ఆరోగ్య రంగం కరోనా సమయంలో గట్టి సవాల్ను ఎదుర్కొని నిలిచింది. పొరుగు రాష్ర్టాల ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్కు, ఇతర పట్టణాలకు వచ్చి స్వస్థత చేకూరిన తర్వాత తిరిగివెళ్లారు. ఆరోగ్య రంగం లో తెలంగాణ సాధించిన విజయాలకు నీతి ఆయోగ్ వంటి సంస్థలు ఇచ్చిన ర్యాంకులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోగ్యమస్తు.