నేతాజీ అంటే దేశ ప్రజానీకానికి గుర్తుకొచ్చేది సుభాష్ చంద్రబోసే. కానీ, మన దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రజలకు మాత్రం బోస్తోపాటూ ములాయం సింగ్ యాదవ్ కూడా స్ఫురణకొస్తారు. ఎందుకంటే, నాలుగు దశాబ్దాలుగా వారు ములాయంను ‘నేతాజీ’ అంటూ ప్రేమపూర్వకంగా పిల్చుకుంటున్నారు. ములాయం కన్నుమూతపై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా వెల్లువెత్తిన సంతాప సందేశాలు దేశ రాజకీయాలపై ఆయన వేసిన ముద్రను వెల్లడిస్తాయి. కుస్తీ యోధుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఉపాధ్యాయుడిగా మారి అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ములాయం జీవితం సుదీర్ఘమైనది, బహుముఖమైనది. 27 ఏండ్ల చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన ములాయం తన జీవితంలో అత్యధికభాగం దాదాపు 60 ఏండ్లు రాజకీయాల్లోనే గడిపారు. అనేక ప్రయోగాలు జరిపారు.
చరిత్రలో కొన్ని చీకటి అధ్యాయాలు మరింత వెలుగుకు దారినిస్తాయి. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కూడా అటువంటిదే. నియంతృత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డ భారతదేశం ఎంతోమంది కొత్తతరం నాయకులకు జన్మనిచ్చింది. వారిలో ములాయం ఒకరు. ఎమర్జెన్సీలో 19 నెలల జైలు జీవితం గడిపిన ములాయం ఆ తర్వాతకాలంలో స్వయంకృషితో యావత్ దేశం గుర్తించే నేతగా ఎదిగారు. 1992లో సొంతంగా సమాజ్వాదీ పార్టీని స్థాపించటానికి మూడేండ్ల ముందే యూపీ సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ములాయం 10 సార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర రక్షణమంత్రిగా పని చేశారు. మూడుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకదశలో దేశ ప్రధాని పదవి రేసులో కూడా ఆయన నిలిచారు.
భారతదేశంలో మరీ ముఖ్యంగా ఉత్తరభారతంలో 1990లలో వెల్లువెత్తిన బీసీల రాజకీయ చైతన్యాన్ని నిశ్శబ్ద విప్లవంగా పలువురు దేశ, విదేశీ సామాజిక శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. ఈ నిశ్శబ్ద విప్లవానికి మూలస్తంభాలుగా నిలిచిన వారిలో ములాయం ఒకరు. దేశ జనాభాలో అత్యధికులైన బీసీలలో రాజ్యాధికారానికి రాగలమనే ఆత్మవిశ్వాసాన్ని ములాయం, లాలూ, శరద్ యాదవ్ తదితరులు తీసుకురాగలిగారు. బీజేపీ మత రాజకీయాలకు గట్టిగా ఎదురొడ్డి నిలవటం ములాయం జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం. తాను సీఎంగా ఉన్న కాలంలో బాబ్రీమసీదు విధ్వంసానికి జరిగిన యత్నాల్ని ఆయన సమర్థవంతంగా అడ్డుకున్నారు. బీజేపీ ఆధిపత్య విస్తరణను దాదాపు 25 ఏండ్లపాటు ములాయం తదితర నేతలు అడ్డుకోగలిగారు. ప్రస్తుతం దేశ ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా తయారైన బీజేపీపై పోరాటాన్ని ములాయం స్ఫూర్తితో ఉధృతం చేయాలి.