‘ప్రజాస్వామ్యం విజయవంతం కావటంలో ప్రతిపక్షాల నిర్మాణాత్మక పాత్ర కీలకమైనది’ అని రాజనీతిశాస్త్రం చెబుతుంది. ప్రధానికి విపక్ష నేతలు, ముఖ్యమంత్రులు రాసిన లేఖను ఇటువంటి నిర్మాణాత్మక పాత్రను పోషించటంలో భాగంగానే చూడాలి. మనీశ్ సిసోడియా అక్రమ అరెస్టుపై ఈ లేఖ నిరసన స్వరాన్ని బలంగా వినిపించింది. నియంతృత్వం వైపు సాగుతున్న భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ప్రయత్నం ఇది. ప్రతిపక్షం లేనిది ప్రజాస్వామ్యమే లేదు. అటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కే పనికి కేంద్రంలోని బీజేపీ పూనుకొంటున్నది. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థల దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. లాలూ నుంచి అభిషేక్ బెనర్జీ వరకు ఎంతోమంది ప్రతిపక్ష నేతలు ఈ దుర్మార్గానికి బాధితులే. దేశంలో తమ పార్టీ తప్ప మరొకటి ఉండకూడదనుకునే బీజేపీ నాయకత్వం నియంతృత్వ ఆలోచన ధోరణికి అనుగుణంగానే ఇది జరుగుతున్నది.
బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడుతున్నదని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు వెల్లడిస్తున్నాయి. ప్రజాస్వామ్య సూచీలో 2014 నాటికి భారత్ ర్యాంకు 27కాగా క్రమంగా దిగజారుతూ 2022కు 66వ స్థానానికి చేరుకున్నది. ప్రపంచంలోని తొలి పది నిరంకుశ రాజ్యాల్లో భారత్ ఒకటని ‘వీ-డెమ్ డెమోక్రసీ నివేదిక-2023’ తాజాగా ప్రకటించింది. భారత్కన్నా టాంజానియా, మెక్సికో, నైజీరియా వంటి దేశాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని అది తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు అందుకున్న భారత్.. బీజేపీ సంకుచిత, మతరాజకీయాల కారణంగా క్రమేణా నియంతృత్వం దిశగా మన కళ్ల ముందే పతనమవుతున్నది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల దీని సంకేతాలు కనిపిస్తున్నాయి. గోవులను రక్షించే పేరుతో మైనారిటీలపై దాడులు చేసి, హత్యలు చేస్తున్న వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు. దళితులపై దాడులు గతంలో కన్నా అనేక రెట్లు పెరిగాయి. మనుధర్మాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కరిస్టులు నిరసన వ్యక్తం చేయటం ఏండ్లుగా దేశంలో జరుగుతున్నది. ఇప్పుడు అటువంటి నిరసనల మీద కూడా కత్తి గడుతున్నారు.
దీనికి ఏదో ఒక దశలో గట్టి ప్రతిఘటన లేకపోతే.. 75 ఏండ్లలో సాధించుకున్న పౌరహక్కులు, రాజ్యాంగం అందించిన హక్కులు అన్నీ కనుమరుగవుతాయి. బీజేపీ, దాని వెనుక ఉన్న శక్తులు వాస్తవానికి కోరుకుంటున్నది కూడా అదే. దీనిని ఎదుర్కొనక తప్పదు. అది నేటి కర్తవ్యం. విపక్ష నేతలు తమ లేఖ ద్వారా ఆ కర్తవ్యాన్ని స్వీకరించారు. బలమైన నిరసన స్వరాన్ని వినిపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే మహాయజ్ఞంలో ఇదొక కీలక మలుపు. ఈ సంఘటితత్వం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ప్రజలే కేంద్రంగా ప్రజల అభివృద్ధే ప్రధానంగా సాగే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి ఇది నాంది. ప్రజాబలం ముందు ఎంతటి నిరంకుశ శక్తి అయినా బలాదూరేనని చరిత్ర అనేక మార్లు రుజువు చేసింది. మరోసారి ఆ సత్యాన్ని నిరూపించాల్సిన ఆవశ్యకత నేడు భారత సమాజం ముందున్నది.