‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు’ అన్నారు మహాత్మాగాంధీ. ‘అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం’ అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఆచరణలో అమలుచేసి చూపిస్తున్నారు ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్. గిరిజన ఆవాసాలకు పంచాయతీ హోదా కల్పించి స్వపరి పాలనకు పునాదులు వేశారు.ఆయన చేపట్టిన చొరవతో తండాల్లో చీకట్లు తొలగి ప్రగతి పొద్దు పొడిచి ఐదేండ్లు పూర్తయింది. మావ నాటే మావ రాజ్ (మా తండాలో మా రాజ్యం) అనే గిరిజనుల దశాబ్దాల కల స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సాకారమైంది.
2008లో తండాలో నిద్ర సందర్భంగా అక్కడి దైన్యాన్ని చూసి చలించిపోయిన ఉద్యమనేత ఇచ్చిన హామీ సాహసోపేతమైన రీతిలో, ప్రత్యేక చొరవతో కార్యరూపం దాల్చింది. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యానికి బలమైన పునాదులు పడిన రోజది. కొండల్లో, కోనల్లో, ఎండల్లో, వానల్లో, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన తండాల్లో స్వపరిపాలన రావడంతో ఆదివాసీ గిరిజనుల జీవితాలు కొత్త మలుపు తిరిగాయి. అధికార వికేంద్రీకరణే అభ్యుదయానికి నాంది అనే ఆలోచనతో తండాలు, గూడేలు, పల్లెలను పంచాయితీలుగా మార్చారు. అప్పటికి 8 వేలకు పైగా ఉన్న పంచాయితీల సంఖ్య 50 శాతానికిపైగా పెరిగింది. కొత్తగా 4,383 పంచాయితీలు ఏర్పాటైతే అందులో తండాలు, గూడేల సంఖ్య 2,551. వాటిలో 1,326 పూర్తిగా తండాలే.
2018 ఆగస్టు 2వ తేదీ కొత్త పంచాయతీలు అస్తిత్వంలోకి వచ్చా యి. కొత్త పంచాయతీలు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు వీలుగా నిధులు, విధులు కేటాయించారు. జనాభా ప్రాతిపదికన రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇచ్చారు. కొండకోనల్లో విసిరేసినట్టుండే తండాలకు సరైన రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదు. మట్టిరోడ్లు, కాలిబాటలే దిక్కు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అలాంటిది పంచాయతీలుగా ప్రమోట్ కావడంతో రోడ్లు మాత్రమే కాకుండా బడులు, ప్రాథమిక వైద్యకేంద్రాలు, పల్లెప్రకృతి వనాలు, నీటి వసతి, పారిశుధ్యం వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. పంచాయితీల్లో రోడ్ల కోసం విడిగా రూ.5 వేల కోట్లు మంజూరు చేశారు. ప్రతి పంచాయతీకి వ్యవసాయ విస్తరణాధికారి, అంగన్వాడీ వర్కర్ వంటి 17 రకాల ఉద్యోగులను నియమించారు. రాష్ట్రమంతటా చిన్న పంచాయతీలు రావడంతో గ్రామ స్వపరిపాలన సులభతరమైంది.
పంచాయతీలుగా మారడంతో తండాలు కొత్తశోభను సంతరించుకున్నాయి. వేరే పంచాయతీల పెత్తనం కింద బతుకీడ్చాల్సిన అవసరం తప్పింది. తమను తాము పాలించుకునే అవకాశం కలిగింది. ఉమ్మడి పాలనలో ఆకలికి, అజ్ఞానానికి చిరునామాలుగా ఉన్న తండాలు ఇప్పుడు అభివృద్ధిలో మేము సైతం అంటూ ముందుకువస్తున్నాయి. గిరిజన బిడ్డలకు సర్పంచ్ పదవులు దక్కాయి. తమ నిధులు తామే ఖర్చు చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. మొత్తంగా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సంపూర్ణంగా అమలవుతున్నదని చెప్పవచ్చు.