ఎడాపెడా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలకు ఆ హామీలను అమలు చేయండంటే ఎందుకో అలవిమాలిన ఉక్రోషం వస్తున్నది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే ఆత్రంలో అమలు చేయలేని హామీలు ఇచ్చారా? లేక అధికారంలోకి వచ్చాక చేస్తే ఏమిటి? చేయకపోతే ఏమిటి? అని అనుకుంటున్నారా? అనేది వారికే తెలియాలి. కాంగ్రెస్ ఇచ్చిన 420 హమీలను అమలు చేయాలంటే ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ ఏ మూలకూ సరిపోదని విజ్ఞులు ఇదివరకే లెక్కతేల్చారు.
కొత్త హామీల సంగతి అలా ఉంచి, నిన్నటిదాకా సజావుగా అమలైన రైతుబంధు వంటివాటిని కొత్త ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నదో అర్థం కావడం లేదు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజల తరఫున ప్రశ్నలు వేస్తే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారు. ‘బీఆర్ఎస్ను బొందపెడుతాం’ అంటూ అంతెత్తు ఎగురుతున్నారు. బీఆర్ఎస్ను బొందపెడుతాం అని హుంకరించడం దేనికి? హామీలు అమలు చేస్తే చాలు కదా!
ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉంది కాంగ్రెస్ తీరు. నిలదీస్తే కలబడేందుకు తెగిస్తున్నది. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి స్పందిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉన్నది. ఆయన ఉపయోగిస్తున్న భాష సీఎం స్థాయికి, హోదాకు తగ్గట్టుగా ఉండటం లేదు. తెలంగాణ సాధించిన నేత కేసీఆర్. తెలంగాణను సమున్నతంగా నిలబెట్టిన దార్శనికుడాయన. ప్రజలు రెండు విడతలు ఆయన చేతికే పగ్గాలు ఇచ్చారన్న సంగతి మరిచిపోతే ఎలా? కాంగ్రెస్ను మూలకు పెట్టింది కూడా ఆ ప్రజలే కదా! మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ను బలమైన ప్రతిపక్షంగా నిలబెట్టిందీ వారే.
స్వరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిపై, ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా, అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం సంస్కారం అనిపించుకోదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని, వంద అడుగుల లోతులో పాతిపెడుతామని హుంకరించడం ఎందుకు? పరిపాలన అంటే విపక్షాన్ని తిడుతూ కూర్చోవడమేనా? విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడైనా హుందాగా వ్యవహరించాలన్న సోయి మరిచి అక్కసుతో తిక్కమాటలు మాట్లాడటాన్ని గమనిస్తే బీఆర్ఎస్ పేరెత్తితేనే కాంగ్రెస్ నేతలకు జడుపు జ్వరం కలుగుతున్నదా! అని అనిపిస్తున్నది.
‘రైతుబంధు పెట్టుబడి సాయం ఇంకా అందలేదన్నోళ్లను చెప్పుతో కొట్టండి’ అని మంత్రి కోమటిరెడ్డి దుర్భాషలాడటం నిస్పృహకు సంకేతం! ‘బీఆర్ఎస్ను 14 ముక్కలు చేస్తం.. మేం తలచుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలను 39 ముక్కలు చేస్తాం’ అని మరో సందర్భంలో అదే మంత్రి ఎగిరెగిరి పడటం ఆయనలోని భయాన్ని, అరాచకత్వాన్ని సూచిస్తున్నది. ఈ ధోరణి ఇంకాస్త పెచ్చరిల్లి బీఆర్ఎస్ నేతలపై, కార్యకర్తలపై దాడులకు దారితీస్తున్నది.
తాజాగా అదే మంత్రి పాల్గొన్న ఓ అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్కు చెందిన జడ్పీ చైర్మన్పై దాడి జరగడం, పోలీసుల సాయంతో ఆయనను బయటికి గెంటించడం నకారాత్మక ధోరణికి పరాకాష్ఠ. మరోవైపు కేసులు, విచారణల పేరిట బెదిరించడమూ జరుగుతున్నది. బట్టకాల్చి మీదేసినట్టు బీఆర్ఎస్పై అడ్డగోలు ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు. ప్రజలు బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్కు ఓ అవకాశం ఇచ్చారు. ఏదైనా చేసి చూపితే బాగుంటుంది. అంతే తప్ప బీఆర్ఎస్ మీద ఇంకా బురద జల్లుతూ కూర్చుంటామంటే కుదరదు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ ముఖ్యులు గుర్తించాలి. ఆరోపణలు, భౌతికదాడులకు బదులు ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకొని, పటిష్ఠమైన ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగడం మంచిది.