అన్ని విజయాలూ పోరాడి సాధించుకున్నవి కావు. కొన్నిసార్లు ఓడిపోయినవారు అప్పనంగా రాసిచ్చిన విజయాలూ ఉంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఆ కోవలోనిదే. ఆ గెలుపులో కాంగ్రెస్ సత్తా కన్నా బీజేపీ బలహీనతలే ఎక్కువ. మతోన్మాద విధానాలు, అవినీతితో కుళ్లిపోయిన బీజేపీ పాలనను ప్రజలు తిరస్కరించారు. ఆ వ్యతిరేకతతోనే మరో ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ చేతికి పగ్గాలిచ్చారు. అయితే వారి పరిస్థితి అంతటితో అయిపోతుందా? హడావుడిగా గుదిగుచ్చిన ఐదు గ్యారెంటీలను అమలుచేయాలంటే మాటలా? కేవలం ఆరు నెలల కాలంలోనే హామీలు అమలుచేయలేక, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం కాంగ్రెస్ మార్కు పరిపాలనకు నిదర్శనం. ఐదేండ్లు పరిపాలించాల్సిన పార్టీ పనితనం సగం ఏడాదిలోనే తేలిపోయింది.
అధికారానికి దూరమై అర్రులు చాస్తున్న కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించింది. రకరకాల వర్గాలను రకరకాలుగా ఊరించింది. ఉచిత కరెంటు ఇస్తామనేది అం దులో మొదటిది. పేద, ధనిక తేడా లేకుండా ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సరఫరా చేస్తామని చెప్పారు. దీనికి గృహజ్యోతి అని అందమైన పేరు కూడా పెట్టారు. కానీ ఈ జ్యోతి వెలగలేక మినుకు మినుకుమంటున్నది. అందరికీ కాదు కొందరికే అంటూ సవాలక్ష కొర్రీలు పెట్టారు. లబ్ధిదారుల సంఖ్య పరిమితం చేయడం ఆ కొర్రీల లక్ష్యమనేది పైకే తెలిసిపోతున్నది. మరోవైపు కోతలు, బిల్లుల మోతలతో చుక్కలు చూపిస్తున్నది. అన్నభాగ్య కింద ఉచిత బియ్యం సరఫరా చెయ్యలేక అరకొర నగదుతో సరిపెడుతున్నారు. యువనిధి కింద ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇంకా మొదలుకానే లేదు. గృహలక్ష్మి కింద మహిళలకు రూ.2,000 సాయంగా ఇస్తామన్నారు. కోట్ల మంది నమోదు చేసుకుంటే వందల సంఖ్యలో కూడా పంపిణీ జరగలేదు. శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని హామీ ఇచ్చారు. ఆర్టీసీకి నష్టాలు రావడంతో అమలు చేయలేక బ్రేకులు వేస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కర్ణాటక ఓటర్లను కాంగ్రెస్ బురిడీ కొట్టించిందని ఈ పథకాల ప్రహసనంతో తేలిపోయింది. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను ఎంచుకున్న కర్ణాటక ప్రజలు తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందని వాపోతున్నారు.
లెక్కాపత్రం లేకుండా ఇచ్చిన హామీలు ఓ వైపు ఈడిగిలబడుతుంటే అటు ప్రభుత్వ పెద్దలు పదవుల కొట్లాటలో తలమునకలై కాంగ్రెస్ కల్చర్ అంటే ఏమిటో చవిచూపిస్తున్నారు. నేను సీఎం అంటే నేను సీఎం అని ఒకరిని మించి మరొకరు రంకెలు వేస్తూ రాజకీయాన్ని అరాచకీయం చేస్తున్నారు. అవినీతి పుట్టల్లోంచి బుసలు కొడుతున్న నోట్ల కట్టలు స్కాంగ్రెస్ అనే మారుపేరును సార్థకం చేస్తున్నాయి. కాంగ్రెస్ను నమ్మి మోసపోతే గోసపడుడేనని దేశ ప్రజలకు, తెలంగాణకు కర్ణాటక ఇస్తున్న తాజా సందేశం!