ఆయన సాహసం ఓ ఒరవడి దిద్దింది. ఆయన కృషి మనకు నడవడి నేర్పింది. కేంద్రం అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్కు ఆయన ఆనాడే బీజారోపణ చేశారు. తన కృషినే మారుపేరుగా చేసుకున్న ఆ మహానుభావుడే ‘సులభ్’ పాఠక్ లేదా బిందేశ్వరి పాఠక్. సులభ్ శౌచాలయ్తో సమాజంలో సమూల మార్పులు తెచ్చిన సంస్కర్త. ఒకప్పుడు మురికి పెంటలుగా కంపు కొట్టిన పురవీధులు ఇప్పుడు ఆయన తెచ్చిన ‘సులభ్’ విప్లవంతో స్వచ్ఛతను సంతరించుకున్నాయి. ఇండ్లల్లోనూ పాయిఖానాల నిర్మాణాలను ఉద్యమస్థాయిలో చేపట్టారు. బహిరంగ మలవిసర్జన అనే సమస్యకు పరిష్కారం చూపేందుకు ఆయన సులభ్ కాంప్లెక్స్ అనే భావనకు శ్రీకారం చుట్టారు. అందులో వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమైన సౌకర్యాలను పొందుపర్చారు. నామమాత్రపు సుంకంతో సేవలు పొందే వీలు కల్పించారు. తద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించారు.
నిజానికి పాఠక్ కృషి కేవలం సులభ్ శౌచాలయ్లకే పరిమితం కాదు. ఆయనది బహుముఖీనమైన పోరాటం. తాను నిర్ణయించుకున్న సామాజిక లక్ష్యాల సాధనకు ఆయన సులభ్ ఇంటర్నేషనల్ అనే సామాజిక సేవా సంస్థను నెలకొల్పారు. మానవహక్కులు, పర్యావరణ పరిశుద్ధి, సంప్రదాయేతర ఇంధన వనరులు, వ్యర్థాల నిర్వహణ, విద్యావ్యాప్తి ద్వారా సంఘ సంస్కరణలు సాధించడం సంస్థ ముఖ్య లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఇవన్నీ కూడా మానవ పారిశుధ్య నిర్వహణతో ముడిపడి ఉన్న విషయాలే కావడం గమనార్హం. మనుష్యుల వ్యర్థాలను మనుష్యులే తలపై మోసే ఘోర దురాచారానికి తెరవేసేందుకు ఆయన రెండు గుంతల పాయిఖానాలు కట్టించారు. పారిశుధ్య కార్మికుల విముక్తికి అనితర సాధ్యమైన కృషిచేశారు. మానవ వ్యర్థాల నుంచి ఎరువులు, సహజవాయువు తయారుచేసే ప్రక్రియకూ శ్రీకారం చుట్టారు. ఒక జటిలమైన సమస్యకు సమగ్ర పరిష్కారం చూపించిన సంఘసంస్కర్తగా చరిత్రలో నిలిచారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణలో ఆయన చూపిన దారి అద్వితీయం, అపూర్వం. మూడు దశాబ్దాల కిందట ఆయన వేసిన దారి ఇప్పుడు అనేక దేశాలకు రహదారిగా మారింది.
పాఠక్ కృషికి గుర్తింపుగా పద్మభూషణ్తో సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, బహుమానాలు వరించాయి. విజయాలు సాధించిన తర్వాత మెచ్చుకోళ్ల మాట అటుంచితే ఉద్యమం తొలినాళ్లలో ఆయన ఎన్నో అడ్డంకులు, అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నది ఇక్కడ గుర్తుచేసుకోవాలి. అయినవారే కాదన్నారు. చీకొట్టారు. నువ్వు చేస్తున్న పని ఫలానా అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉందని అవమానించారు. ముఖం చాటేశారు. అయినా ఆయన చలించలేదు. మొక్కవోని దీక్షతో ముందుకుసాగారు. ఇవాళ 13 లక్షల ఇండ్లలోని మరుగుదొడ్లు, 5.4 కోట్ల పబ్లిక్ మరుగుదొడ్లు ఆయన కృషికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం నాడు కన్నుమూసిన పాఠక్ను దేశానికి స్వచ్ఛ స్వాతంత్య్రం తీసుకువచ్చిన యోధుడిగా స్మరించుకొని నివాళులు సమర్పించుకోవడం సముచితం.