అవనిలోనే కాదు, ఆకాశంలోనూ సగమైన మహిళా లోకానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎనలేనిది. పసికందు నుంచి పండు ముదుసలి వరకూ ఆసరాగా నిలుస్తూ భరోసానిస్తున్నది. దీంట్లో భాగంగానే ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పేరుతో మరో వరాన్ని ప్రకటించింది. కాబోయే తల్లుల ఆరోగ్యం బాగుంటేనే వారు జన్మనిచ్చే భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉంటుందన్న తాత్విక దృక్పథమే ఈ పథకానికి నేపథ్యం. గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టటం, తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటమే లక్ష్యంగా ఈ న్యూట్రిషన్ కిట్లను ప్రసవం లోపు రెండుసార్లు ఉచితంగా అందజేయనున్నారు. రూ.1962 విలువైన ఈ కిట్లో పౌష్టికాహార పౌడర్, ఖర్జూర పండ్లు, నెయ్యితోపాటు టానిక్లు, ట్యాబ్లెట్లు ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించి, దాని నివారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి మహిళాధికారులు జరిపిన అధ్యయనం నుంచి పుట్టినదే ఈ వినూత్న పథకం.
దీనిని కేవలం ఏజెన్సీకే పరిమితం చేయకండా, రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణయించటం మహిళల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ ఎంతటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నారో తెలుపుతున్నది. తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన తల్లికి మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు ప్రోత్సాహకంగా అందిస్తున్నది. దానికి తోడు కేసీఆర్ కిట్ను బహుమతిగా ఇస్తున్నది. ఆడబిడ్డ పుట్టగానే ప్రభుత్వం నేనున్నానన్న భరోసా కల్పిస్తున్నది. బిడ్డ చదువునే వయస్సుకు చేరుకోగానే.. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన గురుకులాల్లో విద్య ఉచితంగా లభిస్తున్నది. విదేశాల్లో చదువుకుంటానంటే ప్రభుత్వం రూ.లక్షల్లో ఆర్థికసాయం అందజేస్తున్నది. పర్వతారోహణ వంటి సాహసక్రీడల్లో అభిరుచి ఉన్న వారికి క్రీడా పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణను ఇప్పిస్తున్నది. ముఖ్యమైన పోటీలలో విజేతలుగా నిలిస్తే వారు మరింతగా కృషి చేసేలా ప్రోత్సహిస్తూ, రూ.కోట్లల్లో బహుమతులను అందజేస్తున్నది. ఇప్పటికే పలువురు మన బిడ్డలు తెలంగాణ ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పి, సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇది సాధించామని చెప్పటం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం.
పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి మహిళలకు రాష్ట్రప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తూ రాయితీలు, మినహాయింపులు ఇస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలకు దేశంలోనే రికార్డు స్థాయిలో రుణాలను అందజేస్తున్నది. సభ్యులకు నామమాత్రపు ప్రీమియంతో బీమా సదుపాయం కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీలోనూ యువతులకు సమాన అవకాశాలు కల్పిస్తూ, విద్యుత్శాఖలో లైన్మెన్ వంటి సంప్రదాయేతర ఉద్యోగాలకూ వారిని తీసుకుంటున్నది. వితంతు, ఒంటరి, వృద్ధాప్య మహిళలు, బీడీ కార్మికుల వంటి పలు వర్గాలకు నెల నెలా పింఛన్లను ఇచ్చి భరోసాను కల్పిస్తున్నది. మహిళల రక్షణకు పోలీసు శాఖలో ప్రత్యేకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేసింది. మన షీటీమ్స్ దేశంలోని పలు రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలిచాయి. తెలంగాణలో ఆడబిడ్డలు పదిలం. దేశానికే ఆదర్శం మన రాష్ట్రం.