మోదీ హయాంలో భారత్ పతోనోన్ముఖ ప్రస్థానాన్ని ఈసారి ‘ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక 2021-22’ వెల్లడించింది. మొత్తం 191 దేశాలను లెక్కిస్తే వాటిలో మన ర్యాంకు 132. పొరుగునున్న శ్రీలంక (73), చైనా (79), బంగ్లాదేశ్ (129), భూటాన్ (127) మనకన్నా మెరుగ్గా ఉండగా.. పాకిస్థాన్ (161), మయన్మార్ (149), నేపాల్ (143)లను చూసి సంతోషించాల్సిన పరిస్థితి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశానికి ఏమాత్రం శోభనివ్వని ర్యాంకు ఇది. కనీసం కిందటిసారి కన్నా మెరుగైన పరిస్థితి ఉందా అంటే అదీ లేదు. పోయినేడాది ఇదే సూచికలో మన స్థానం 131. ఆర్థికవ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా, ఎంతకూ ఒడువని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో చాలా దేశాల పరిస్థితి క్షీణించిందని ఐరాస అధికారులే వెల్లడించారు. కేంద్రం దీనిని చూసి ఊరట చెందవచ్చు. కానీ, అవి రెండూ ఉనికిలోకి రాకమునుపే దేశం పరిస్థితి అధోగతి పాలయిన విషయాన్ని అనేక అంతర్జాతీయ నివేదికలు కళ్లకు కట్టాయి.
ప్రపంచ ఆకలి సూచికలో భారత్ ర్యాంకు 2014లో 55 కాగా, గతేడాది అది 101కి పడిపోయింది. మొత్తం 116 దేశాలలో మనకు దక్కిన స్థానం అది. ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో భారతదేశం మోదీ రాకముందు 2014లో 27వ స్థానంలో ఉంటే 2020లో 53వ స్థానానికి దిగజారింది. ఇవన్నీ విదేశాల నుంచి లభించిన ‘కీర్తి కిరీటాలు’ కాగా.. దేశంలోనూ వీటికి కొదవ లేదు. రెండేండ్ల వయసులోపు శిశువుల్లో 89 శాతం మందికి బలవర్ధకమైన ఆహారం లభించటం లేదని జాతీయ కుటుంబ ఆరోగ్య తాజా సర్వే ఈ మధ్యన వెల్లడించింది. నిరుద్యోగం రికార్డు స్థాయిలో దాదాపు 10 శాతానికి పెరిగిపోయింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తానని యువతలో ఆశలు రేపి, వారి చేత ఓట్లు వేయించుకొని మోదీ అధికారంలోకి వచ్చారు. కానీ, రెండు కోట్లు కాదు కదా.. అర కోటి ఉద్యోగాలను కూడా ఈ ఎనిమిదేండ్లలో భర్తీ చేయలేదు.
ఈ రకంగా దేశాన్ని ఏలినవారు పాలిస్తుంటే.. అంతర్జాతీయ సూచికల్లో నగుబాటు కాకుండా ఏం దక్కుతుంది? కనీసం ఈ నివేదికలను చూసైనా చర్యలు తీసుకునే విచక్షణ కేంద్ర పాలకుల్లో కనిపించటం లేదు. ఆయా నివేదికలే తప్పని, వాటిలో తీసుకున్న కొలమానాలు తప్పని, భారతదేశం వెలిగిపోతున్నదని బీజేపీ నేతలు, ఏకంగా ప్రభుత్వ పెద్దలే గతంలో మాట్లాడటం చూసి ప్రపంచం ముక్కున వేలేసుకున్నది. కాబట్టి, కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా వివేకంతో వ్యవహరించి, మానవాభివృద్ధికి కీలకమైన సంక్షేమరంగాలను పట్టించుకోవాలి. ఉచితాలు అనుచితం అంటూ పేదల పొట్టకొట్టే పనులకు పాల్పడకుండా ఉండాలి.