దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కావడం స్వతంత్ర భారత చరిత్రలోనే భారీ మార్పునకు సంకేతంగా చెప్పుకోవచ్చు. నాడు 2001లో సింహగర్జన మహోద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసింది. ఇప్పుడు కేసీఆర్ ప్రేరణగా ప్రగతి భవన్లో జరిగిన రైతు నాయకుల సమావేశం కూడా దేశ చరిత్రను మలుపు తిప్పనున్నది. ‘సువర్ణరౌప్య మాణిక్యవసనైరపి పురితా/ తథాపి ప్రార్థయంత్యేవ కృషకాన్ భక్త తుష్ణ యా’ అన్నట్టు- బంగారం, వెండి, మణులు, వస్ర్తాలు ఎన్ని ఉన్నా, మానవులు ఆహారం కోసం రైతుపై ఆధారపడక తప్పదు. కానీ ఆ అన్నదాతలపైనే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా డెబ్బయి ఐదు ఏండ్లుగా పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరింత పచ్చిగా రైతు వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయి. మరోవైపు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం రైతు అనుకూల విధానాలు అమలు చేస్తూ దీపస్తంభంలా నిలిచింది. ఈ పాలనాతీరే రైతులను కేసీఆర్ పిలుపునకు స్పందించేలా చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ సమస్యను చేపట్టినా, దానిని మూలాల నుంచి అధ్యయనం చేస్తారు. శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించి పరిష్కార మార్గాన్ని కనుగొంటారు. ఉద్యమ పంథా అయినా, పరిపాలనా విధానమైనా కచ్చితమైన వ్యూహరచనతో సాగుతుంది. అందుకే దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రైతుల ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలనీ, ఇందుకు కేసీఆర్ నాయకత్వం వహించాలని జాతీయ రైతు సంఘాల సదస్సు తీర్మానించింది. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి కేసీఆర్ అనుసరించిన విధానాలను దేశవ్యాప్తంగా రైతులు అర్థం చేసుకున్నారు. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను చర్చించిన రైతులు, ఉద్యమ పంథాకు పథక రచన చేయవలసిన బాధ్యతను కూడా కేసీఆర్ చేపట్టాలని కోరారు.
రైతుల ఉద్యమానికి పార్లమెంటరీ పంథాను జోడించాలంటూ సదస్సులో కేసీఆర్ చేసిన సూచన గమనార్హమైనది. తెలంగాణ ఉద్యమం కూడా ఇటువంటి జమిలి పంథా ద్వారానే విజయవంతమైంది. కొన్ని రాజకీయపక్షాల చర్యల వల్ల పార్లమెంటు వంటి ప్రజాస్వామిక వ్యవస్థలు విశ్వసనీయతను కోల్పోతున్న సందర్భంలో రైతులు ప్రజాప్రాతినిధ్య రాజకీయాలలో భాగస్వాములు కావాలంటూ కేసీఆర్ పిలుపునివ్వడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. దేశవ్యాప్తంగా రైతులోకం క్రియాశీలంగా పాల్గొనడం వల్ల రైతులు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ప్రజాస్వామిక వ్యవస్థ కూడా పరిపుష్టం అవుతుంది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తేవడానికి, తద్వారా స్వతంత్ర భారతానికి సరికొత్త దిశానిర్దేశం చేయడానికి కేసీఆర్ ప్రేరణతో జరిగిన రైతు సదస్సు దోహదపడుతుంది.