‘యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ / ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి’- రథం ఏ విధంగానైతే ఒకే చక్రంతో నడవదో, కఠోర శ్రమ లేకుంటే లక్ష్యాన్ని సాధించలేము. అంకుర పరిశ్రమల రంగంలో తెలంగాణ రాష్ట్రం అంబరాన్ని చుంబించిందంటే అందుకు కారణం – కేసీఆర్ దార్శనికతకు అనుగుణంగా ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సాగించిన అలుపెరుగని శ్రమ. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడంలోనూ, అందుకు అనువైన ఆధునిక ఆవరణాన్ని కల్పించడంలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నదని- ‘అగ్రశ్రేణి ప్రదర్శన’ రాష్ట్ర అవార్డు ప్రదానం సందర్భంగా- కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించక తప్పలేదు. ఈ రంగంలో మన రాష్ట్రం సాగిస్తున్న కృషిని కేంద్ర మంత్రే పరిపరివిధాలుగా శ్లాఘించారు.
వ్యవసాయం, సంక్షేమం వంటి భిన్నరంగాలకు ప్రాధాన్యం తగ్గించకుండానే, పారిశ్రామికరంగంలో విజయ శిఖరాలు అధిరోహించడం తెలంగాణ రాష్ర్టానికి కొత్త కాదు. పారిశ్రామిక రంగాభివృద్ధికి పరిశ్రమిస్తూనే, అంకురాల పోత్సాహ ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రపంచవ్యాప్త పారిశ్రామిక పోకడలతో సంధానమై ఉన్నప్పుడే ఈ ఆలోచనాసరళి అలవడుతుంది. విజ్ఞానశాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ హైదరాబాద్ (రిచ్) పేర ఇంక్యుబేటర్ను నెలకొల్పింది. ‘టీ ఫండ్’ అంటూ ఏర్పాటుచేసి అంకుర పరిశ్రమల్లోకి పెట్టుబడులు ప్రవహించేలా చర్యలు తీసుకున్నది. ఇటీవల టీ-హబ్ రెండవ దశ కూడా ప్రారంభం కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్కు నిలయంగా హైదరాబాద్ పేరు తెచ్చుకున్నది. నిజానికి తెలంగాణ రాష్ట్రమే ఒక స్టార్టప్! అటువంటిది ఇప్పటికే ప్రగతిబాటలో పరుగులు పెడుతున్న రాష్ర్టాలతో పోటీ పడటం అసాధారణం.
యువత ప్రతిభావంతంగా ఉంటే స్టార్టప్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని కరీంనగర్లో ఐటీ హబ్ నెలకొల్పిన సందర్భంగా యువ మంత్రి కేటీఆర్ పురిగొల్పడం గమనార్హం. ఆ తర్వాత ఇదే స్ఫూర్తిదాయక సందేశాలను పలు సందర్భాలలో మంత్రి అందజేస్తూనే ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలలో మనవారు సారథులుగా మారడంతో సరిపోదని, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థల స్థాపకులు కావాలని యువతరానికి పిలుపునిచ్చారు. నవ్య ఆర్థికవ్యవస్థలో వినూత్నంగా ఆలోచించేవారినే విజయం వరిస్తుంది. సృజనాత్మక పథకాలకు రూపకల్పన చేస్తే పెట్టుబడులు ప్రవాహంలా తరలివస్తాయి. ఇప్పటికే మన రాష్ట్రంలోని స్టార్టప్లకు పదివేల కోట్ల మేర నిధులు అందాయి. అంకురాలకు అన్నివిధాలా అండగా ఉండి ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రపంచంలో అగ్రశ్రేణికి చేరడంపైనే యువత దృష్టి నిలుపాలి.