ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభం అంచున కొట్టుమిట్టాడు తుండటం ఆందోళనకర పరిణామం. కరోనా రేపిన కల్లోలంతో పాటు రష్యా తెచ్చిపెట్టిన ఉక్రేయిన్ యుద్ధం మూలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమ నంలో ఉన్నదని, ఈ దుస్థితి దీర్ఘకాలం కొనసాగి అభివృద్ధిని దెబ్బతీస్తుందనీ, ద్రవ్యోల్బణాన్ని మరింత ఉగ్రంగా మారుస్తుందని ప్రపంచబ్యాంక్ తాజాగా వెలువరించిన ‘గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’ నివేదిక వెల్లడించింది. 2021లో 5.7 శాతంగా ఉన్న ఆర్థికాభివృద్ధి 4.1 శాతానికి తగ్గుతుందని జనవరిలో అంచనా వేశారు. కానీ ఇప్పుడది 2.9 శాతానికి దిగజారుతుందని వెల్లడైంది.
వచ్చే ఏడాదికి కూడా ఈ ఆర్థిక దుస్థితి నుంచి బయటపడలేమని ప్రపంచ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోనూ తలసరి ఆదాయం కరోనా కాలం కన్నా దిగజారిపోతుందని హెచ్చరించడం గమనార్హం. సుదీర్ఘ గనిష్ఠ ద్రవ్యోల్బణం, తీవ్ర స్థాయి నిరుద్యోగం, డిమాండ్ నిశ్చలత (స్టాగ్ఫ్లేషన్) కలగలసి సంక్షోభం ఉగ్రరూపం దాల్చే సూచనలు కానవస్తున్నాయి.
దక్షిణాసియాలో శ్రీలంక ఆర్థికంగా దివాలా తీసిన తర్వాత, పాకిస్థాన్, నేపాల్ దేశాల పరిస్థితి కూడా మెరుగ్గా లేదని తెలిసిపోయింది. నేపాల్ విదేశీ మారక ద్రవ్యం నిధులు కొన్ని నెలలకే సరిపోతాయి. దీంతో దిగుమతులను తగ్గించడం ద్రవ్యోల్బణానికి దారితీసింది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ కూడా అధోగమనంలో ఉన్నది. మన దేశంలోనూ విదేశీ మారకద్రవ్య నిలువలు కుంచించుకుపోతు న్నాయి.
పాలకులు అనుసరిస్తున్న విధానాలే దక్షిణాసియా దేశాలు ఆర్థిక సంక్షోభం దిశగా పయనించడానికి కారణమనే ఆరోపణలున్నాయి. దేశ పారిశ్రామిక రంగాన్ని పటిష్ఠం చేసే బదులు కొద్ది మంది వ్యాపారస్థులకు మేలు చేకూర్చే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలు అమలు చేయడం వల్ల పాకిస్థాన్ దెబ్బతిన్నది. భారత్లోనూ ఇటువంటి విధానాలే అమలవుతున్నాయి. వ్యాపార రంగానికి మితిమీరిన పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల ఆ భారాన్ని ప్రజలు మోయవలసి వస్తున్నది. ఈ విధానాలే సంక్షోభకారకాలు అవుతున్నాయి.
భారత్లో రాజకీయ నాయకత్వ అనిశ్చిత విధానాలు మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం. పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. జీఎస్టీని అమలు చేసిన తీరు కూడా విమర్శల పాలైంది. కరోనా రాకముందే దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం మొదలైంది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు కరోనా సమయంలో లాక్డౌన్ అమలు చేసిన తీరు ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీసింది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల్లో అనిశ్చితి వల్ల పెట్టుబడి దారుల్లో విశ్వాసం దెబ్బతిన్నది.
ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచే చర్యలేవీ తీసుకోలేదు. శుష్కప్రియాలు శూన్య హస్తాలు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం మాటలతో సరిపుచ్చుతున్నది తప్ప ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యలేవీ తీసుకోవడం లేదు. ప్రపంచవ్యాప్త ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం కావాలి. ఆర్థిక నిపుణులతోనూ, ముఖ్యమంత్రులతోనూ చర్చలు జరిపి ముంచుకొస్తున్న ముప్పు నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలి.