ఆకాశంలో సగం.. అన్నింటా సగం అని ఉబ్బేయడమే తప్ప నిజానికి మహిళలకు ఇవ్వాల్సిన స్థానం ఇస్తున్నామా? అనే ప్రశ్న నిరంతరంగా ఎదురవుతూనే ఉంటుంది. చోటివ్వడం మాట అటుంచి ఉల్టా వివక్షకు గురిచేయడం జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. మహిళల ఎదుగుదలకు అడుగడుగునా గండాలే ఎదురవుతుంటాయి.
ముఖ్యంగా రక్షణ దళాల్లో. మహిళలంటే అబలలనే అపప్రథ ఉండటమే ఇందుకు కారణమని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాయుధ బలగాల్లో మహిళలకు ప్రవేశం విషయంలో ఇటీవల కొంత కదలిక వచ్చిన మాట నిజం. కానీ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని తెలిపే ఉదంతాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. తాజాగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పులు ఈ విషయంలో మేలుకొలుపుగా భావించాలి. అందులో మొదటిది అత్యున్నత పదవులకు ఎంపిక, రెండోది వివాహం కారణంగా వివక్షకు సంబంధించినది.
భారతీయ తీరప్రాంత రక్షణ దళం (ఐసీజీ)లో స్వల్పకాలిక మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వకపోవడం ఇటీవల చర్చాంశమైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ప్రియాంక త్యాగీ అనే అధికారిణి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సదరు కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళా శక్తి అని మాటలు చెప్పడం కాదు.. ఇక్కడ మీరు దానిని అమలు చేసి చూపండి అని సూటిగా నిలదీసింది. ‘నౌకాదళంలో పర్మనెంట్ కమిషన్ ఇస్తున్నారు.. మీరెందుకు ఇవ్వరు?’ అని కోస్ట్ గార్డును, ప్రభుత్వాన్ని పశ్నించింది.
మహిళలను న్యాయంగా చూసే విధానాన్ని మీరు రూపొందించాల్సి ఉంది అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేయడం గమనార్హం. నారీశక్తి.. నారీ సమ్మాన్ అంటూ అనునిత్యం ఊదరగొట్టే కేంద్రం తన పరిధిలోని ఐసీజీలో మహిళల పట్ల అమలు చేస్తున్న వివక్షను ఎత్తిచూపిన సందర్భమిది. ఇతర బలగాల్లో కీలక స్థానాలకు ఎదిగి దేశరక్షణ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్న మహిళలు కోస్ట్ గార్డులోనూ అంతే సమర్థంగా విధులు చేపట్టగలరని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మహిళా సమానత్వ సాధనలో మరో మైలురాయిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.
ఇక మరో తీర్పు సంసార బాధ్యతల కారణంగా మహిళలు ఎదుర్కొనే వివక్షకు సంబంధించింది. ఇంటి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుందన్న కారణంగా మహిళలను ఉద్యోగాల్లోంచి తరిమివేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని మాజీ లెఫ్టినెంట్ సెలీనా జాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేవలం పెళ్లి చేసుకుందన్న కారణంగా పర్మనెంట్ కమిషన్ ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సాయుధ బలగాల ట్రైబ్యునల్ లక్నో బెంచ్ ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పినప్పటికీ ప్రభుత్వం దానిపై అపీల్ చేసింది. పెండ్లి చేసుకుందన్న సాకుతో మహిళలను ఇంటికి పంపించి వేయడం మొరటు వివక్ష, అసమానత కిందకే వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పితృస్వామిక నిబంధన మానవ గౌరవాన్ని తృణీకరిస్తున్నదని, వివక్షారాహిత్య హక్కు, న్యాయమైన రీతిలో ఉపాధి పొందే హక్కులను ఉల్లంఘిస్తున్నదని మండిపడింది. లింగవివక్ష ఆధారిత చట్టాలు, నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలికి అన్ని రకాల బకాయిల కింద రూ.60 లక్షల పరిహారాన్ని ఎనిమిది వారాల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం కొసమెరుపు.
పైకి తటస్థంగా కనిపించే చట్టం మనకు తెలియకుండానే ఏదో ఒక వర్గాన్ని అణచి వేసేందుకు సాధనంగా ఉపకరించవచ్చు. కానీ అసలైన సమానత్వం కావాలంటే అందులోని నిబంధనలను సామాజిక కోణంలో పరిశీలించాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మరో సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రస్తావించు కోవడం ఎంతైనా సముచితంగా ఉంటుంది. పైన తెలిపిన రెండు కేసుల్లో నూ సుప్రీంకోర్టు మెట్లెక్కితే గానీ న్యాయం జరగకపోవడం విచారకరం. సర్వోన్నత న్యాయస్థానం సూచించిన విధంగా సమగ్రమైన విధానం రూపొందించుకోవడం కేంద్రానికి తక్షణ అవసరమని చెప్పక తప్పదు.