రష్యాలో రాజకీయ ప్రత్యర్థులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కొత్తేమీ కాదు. గతంలో అనేకమంది ప్రభుత్వ వ్యతిరేకులు అంతుతెలియని మరణాల పాలయ్యారు. తాజాగా అలెక్సీ నవాల్నీ మృతి ఆ కోవలోకే చేరింది. 47 సంవత్సరాల నవాల్నీ ఉదయం వాకింగ్కు వెళ్లినప్పుడు ఒక్కసారిగా కుప్పకూలి మరిక లేవలేదని అధికారులు అంటున్నారు. గత మూడేండ్లుగా ఆయన రష్యా ఉత్తర కొసన గల ఐకే-త్రీ లేదా పోలార్ వుల్ఫ్ అనే దుర్భర, దుర్భేద్యమైన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పైగా గత 300 రోజులుగా ఆయన ఏకాంత నిర్బంధంలో గడుపుతున్నారు. అయితే మరణానికి ఒకరోజు ముందు ఆయన ఒక కోర్టు వీడియోలో సంపూర్ణ ఆరోగ్యంతో, ఉత్సాహంగా కనిపించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నవాల్నీ హఠాన్మరణం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఆయన తలపై, ఛాతీపై బలమైన గాయాల గుర్తులున్నట్టు ధ్రువీకృతం కాని వార్తల ద్వారా తెలుస్తున్నది. క్రమంగా ఆరోగ్యం దిగజారిందా లేక హఠాత్తుగా గుండెపోటు వచ్చిందా లేక మరి ఏదైనా ఇతర ఘటన ఆయన ప్రాణాలు తీసిందా అనేది ఇప్పుడప్పుడే తేలకపోవచ్చు. తనను చంపాలని రష్యా ప్రభుత్వం చూస్తున్నట్టు నవాల్నీ మొదటినుంచీ చెప్తూనే ఉన్న సంగతి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది. రష్యాలో అణచివేతను ప్రతిఘటించినందుకు నవాల్నీ తన ప్రాణాలతో మూల్యం చెల్లించారని పాశ్చాత్య దేశాలు అంటున్నాయి. గత దశాబ్దకాలంగా నవాల్నీ రష్యా ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూనే ఉన్నారు. నవాల్నీ తరహా అనుమానాస్పద మరణాలపై క్రెమ్లిన్ మౌనం వహిస్తుంది లేదా తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి చేతులు దులిపేసుకుంటుంది.
అలెక్సీ నవాల్నీ రష్యా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆయనకు ఎంతో అద్భుతమైన భవిత ఉందని అందరూ జోస్యం చెప్పారు. ఏదో ఒక రోజు ప్రజాస్వామిక పునరుద్ధరణ సాధించి రష్యాకు నవాల్నీ దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు మండేలా తరహాలో మహానాయకుడు అవుతాడని అంతా అనుకున్నారు. అయితే 2008లో ఆయన రాజకీయాల కన్నా అవినీతి అంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద మలుపు. ప్రభుత్వ కార్పొరేషన్ల నుంచి కోట్లు కొల్లగొట్టే అధికారుల అవినీతిని ఆయన బయటపెట్టేవారు. పార్టీ ఆఫ్ క్రూక్స్ అండ్ థీవ్స్ అంటే మోసగాళ్లు దొంగల పార్టీ అని ఆయన పుతిన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టేవారు. ఇప్పుడు అది హంతకుల పార్టీ కూడా అయ్యిందని అంటున్నారు.
రష్యా అధ్యక్ష ఎన్నికలు మరో నెలరోజుల్లో ఉన్నాయనగా నవాల్నీ చనిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచి మరో ఆరేండ్లపాటు రష్యాపై తన పట్టును కొనసాగించాలని పుతిన్ భావిస్తున్నారు. అధికారం ఒకవ్యక్తి చేతుల్లో కేంద్రీకృతమై ఉండడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, దానిని భగ్నం చేయాలని నవాల్నీ అనేవారు. నియంతృత్వ చక్రభ్రమణాన్ని ఆపాలంటే పార్లమెంటరీ రిపబ్లిక్ ఏర్పాటే శరణ్యమని చెప్పేవారు. ప్రజల మాటే అంతిమం కావాలని వాదించిన నేత అనుమానాస్పదంగా అంతమైపోవడం ప్రజాస్వామ్యానికి గొప్ప నష్టమే కాదు విషాదం కూడా. ఈ సరికే చెల్లాచెదురై పోయిన రష్యా ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమానికి నవాల్నీ మరణం తీవ్రవిఘాతమేనని చెప్పాలి.