గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుందన్నట్లు చైనీయులు తమ ప్రభుత్వ నిరంకుశత్వంపై ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. జీరో కొవిడ్ విధానం పేరిట నెలలు, ఏండ్ల తరబడి ఇళ్లలో తమను ప్రభుత్వం బంధించి ఉంచటంపై మొదలైన వారి నిరసన రాజకీయ రూపాన్నీ సంతరించుకోవటం విశేషం. ‘జిన్పింగ్ గద్దె దిగు!’ అన్న నినాదం చైనా పట్టణాలు, నగరాల్లో గట్టిగానే వినిపిస్తున్నది. యావత్ చైనా ప్రభుత్వాన్ని, సైన్యాన్ని, కమ్యూనిస్టు పార్టీని తన చెప్పుచేతల్లో పెట్టుకొని, రాజ్యాంగాన్నే మార్చివేసి మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జిన్పింగ్కు ప్రజల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావటం ఇదే తొలిసారి. 1989లో ప్రజాస్వామిక సంస్కరణల కోసం విద్యార్థులు తియానన్మెన్ స్కేర్లో గొంతెత్తినప్పుడు వినిపించిన కమ్యూనిస్టు అంతర్జాతీయ గీతం నేడు మళ్లీ చైనాలో వినిపిస్తున్నది.
ఈ నిరసన జిన్పింగ్ ప్రభుత్వంపై ఏమైనా ప్రభావం చూపుతుందా? లాక్డౌన్ల నుంచి, కర్ఫ్యూల నుంచి ప్రజలు కోరుకుంటున్న విముక్తి దొరుకుతుందా? కనీస హక్కులు వారికి లభిస్తాయా? లేక, నాటి తియానన్మెన్లాగే విఫల పోరాటంగా నిలిచిపోతుందా? అన్నది ఆసక్తిదాయకం. ఏదేమైనా.. జిన్పింగ్ నియంతృత్వ వైఖరిని తాము అంగీకరించటం లేదని చైనీయులు ప్రపంచానికి చాటిచెప్పగలిగారు. ప్రభుత్వం తమ నోరు నొక్కేస్తున్నదని తెలియజేయటానికి ఖాళీ తెల్ల కాగితాలను ప్రదర్శిస్తూ వినూత్నంగా తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వారు వెల్లడించారు. చైనా ప్రభుత్వం తన సహజ ధోరణితో భారీ ఎత్తున అణచివేత చర్యలు చేపడుతున్నది. విశ్వవిద్యాలయ ప్రాంగణాల నుంచి విద్యార్థులను పంపించి వేస్తున్నది. సోషల్ మీడియాపై అనేక ఆంక్షలు విధిస్తున్నది. కానీ ప్రజలలో ఏదో రూపంలో ఆగ్రహం పెల్లుబుకుతూనే ఉన్నది.
ఏ దేశమైనా ఆర్థికంగా ఎంతైనా ముందంజ వేయవచ్చు. కానీ, ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు, నిరంకుశ పాలకుడి ఉక్కు పిడికిట నలుగుతున్నప్పుడు ఆ సమాజం సమస్యల నిలయంగా మారుతుంది. కరోనా మహమ్మారి చైనా నుంచే మొదలైన విషయం తెలిసిందే. కానీ, ఆ వైరస్ చైనాలో వ్యాపించటానికి కొన్ని నెలల ముందే దానితో వచ్చే ముప్పును ఆ దేశానికి చెందిన ఓ యువ వైద్యుడు గుర్తించాడు. అధికారులను హెచ్చరించాడు కూడా. అందుకు ఆయనను ప్రోత్సహించాల్సిందిపోయి, లేని భయాల్ని సృష్టిస్తున్నావంటూ నిర్బంధించారు. చివరికి ఆ వైద్యుడు కరోనాతోనే ప్రాణాలు వదిలాడు. వైరస్ వ్యాప్తి గురించి చైనా చాలా కాలం దాచిపెట్టింది. కరోనా చైనాను దాటి, ప్రపంచాన్ని కమ్మేసింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్లయ్యింది. అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా చైనా ప్రజలు జరుపుతున్న పోరాటానికి ప్రపంచ దేశాలు సంఘీభావంగా నిలువాలి.