వాతావరణ మార్పులతో భూతాపం పెరుగుతున్నది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవటం, పర్యావరణ అనుకూల ఇంధన వనరుల వాడకాన్ని పెంచటం వంటి చర్యలతోనే భూమిని కాపాడుకోవటం సాధ్యమవుతుందని, లేకపోతే మానవాళి తన ఉనికికి తానే చేటు చేసుకున్నట్లని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం తొలి నుంచి అడుగులు వేస్తున్నది. ఈ పరంపరలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ‘కూల్ రూఫ్’ (చలువ పైకప్పు) విధానాన్ని తీసుకురావటం హర్షణీయం. తొలుత తన ఇంటి నుంచే దీని అమలు ప్రారంభించానని మంత్రి కేటీఆర్ చెప్పటం స్ఫూర్తిదాయకం. ఇంట్లో, ఆఫీసులో వేడిని తగ్గించటం ద్వారా ఫ్యాన్లు, ఏసీల వాడకాన్ని తగ్గించటం.. తద్వారా కరెంటు వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడే పథకం ఇది. ప్రభుత్వ భవనాలకు, 600 గజాలకు మించిన స్థలాల్లో నిర్మించే ప్రైవేటు భవనాలకు ఈ విధానాన్ని తప్పనిసరి చేయటం వల్ల సమీప భవిష్యత్తులోనే స్పష్టమైన మార్పును మనం చూడగలం. చిన్న స్థలాల ఇండ్ల యజమానులకు స్వచ్ఛందమే అయినా, వారు కూడా ముందుకొచ్చి, పర్యావరణ పరిరక్షణ మహాయజ్ఞంలో పాలుపంచుకోవాలి. భవిష్యత్తు తరాలకు భూమిని భద్రంగా అప్పగించాలంటే తలా ఒక చెయ్యి వేయాల్సిందే.
తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి బాటన తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రకృతికి, పచ్చదనానికి రాష్ర్టావిర్భావం నుంచే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోరోజునే ఆయన పర్యావరణ పరిరక్షణపై మేధావులతో, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. ఆయన మదిలో రూపుదాల్చిన కార్యక్రమం హరితహారం. 2015లో ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 268 కోట్ల మొక్కలను నాటారు. ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పర్యావరణ పరిరక్షణ ప్రయత్నంగా పేరొందింది. ఐక్యరాజ్యసమితి కొనియాడింది. దీనివల్ల రాష్ట్రంలో పచ్చదనం 18 శాతం నుంచి 31.6 శాతానికి పెరిగింది. భూవిస్తీర్ణంలో మూడోవంతు పచ్చదనం ఉండటం పర్యావరణపరంగా ఆదర్శనీయం. ఇప్పుడు ఈ లక్ష్యానికి తెలంగాణ దగ్గరలో ఉంది. హరితహారానికి భవిష్యత్తులో ఆర్థిక వనరుల కొరత రాకుండా హరితనిధిని కూడా ఏర్పాటు చేయటం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం.
హరిత కృషిని కొనసాగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలను నెలకొల్పారు. మండలానికి ఒకటి చొప్పున మొత్తం 526 మండలాల్లో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నది. పట్టణాలను కూడా పచ్చదనం నీడలోకి తీసుకురావటానికి 109 ప్రాంతాల్లో 75,740 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కృషి ఫలితాలను సాధిస్తున్నది. పచ్చదనం పెంపులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని పార్లమెంటు గత డిసెంబరులో ప్రశంసించింది. పలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ హైదరాబాద్ ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022’ను కైవసం చేసుకుంది. మన దేశంలో మరే నగరానికీ ఈ అవార్డు దక్కలేదు. పచ్చటి ప్రకృతితోనే పచ్చటి జీవితం సాధ్యమని తెలంగాణ నిరూపిస్తున్నది.