హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో అన్యాయమైపోయిన అంధులకు తెలంగాణ రాష్ట్రంలో సముచిత స్థానం కల్పించాలని, బ్లైండ్ అండ్ డిసబుల్డ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని తాను 2015లో ఈటలకు విజ్ఞప్తి చేయగా మంత్రి హోదాలో ఉండి, అనుచితంగా మాట్లాడారని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్(ఏఐసీబీ) కార్యదర్శి చొక్కారావు వాపోయారు. గతంలో ఈటల రాజేందర్ తనను అవమానించిన తీరుపై శనివారం సోషల్ మీడియాలో ఆయన ఒక సందేశం విడుదల చేశారు. తాను ఒక అంధుడను, రాష్ట్రపతి అవార్డు పొందిన పెద్దమనిషిని అనే కనీస గౌరవం లేకుండా ‘నీకు ఎందుకు ఇవన్నీ.. పోయి అంధుల కోసం నువ్వు పెట్టుకున్న స్కూల్ నడుపుకో, నీ పనేదో నువ్వు చేసుకోపో..’ అంటూ కించపరిచారని, తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని చొక్కారావు ఆవేదన వ్యక్తంచేశారు. అంధులను అవమానించిన ఈటలకు ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఉద్యమ సమయంలో నల్లగొండకు వచ్చిన ఈటలను తాను నిర్వహిస్తున్న బ్లైండ్ స్కూల్కి తీసుకెళ్లి సత్కరించానని, దానికి ప్రతిఫలంగా అవమానాన్ని పొందానని బాధపడ్డారు. అది తన ఒక్కడికే కాకుండా అంధులందరికీ జరిగిన అవమానమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్గా పదవీ విరమణ పొంది, అంధుల కోసమే బతుకుతున్న తనకు ఈటల మాటలు తీవ్ర మనోవేదన కలిగించాయని చెప్పారు. ఆనాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదన్నారు. తనకు ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు.
ప్రభుత్వహాస్టల్లో చదువుకొంటే, నేడు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని చొక్కారావు ఈటలను డిమాండ్చేశారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవద్దని బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల పార్టీలో చేరితే బీజేపీ గబ్బుపట్టి పోతుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూరాబాద్లో ఈటలపై ఇండిపెండెంట్గా పోటీచేసి, ఆయన అంధులను అవమానించిన తీరును ప్రజలకు వివరిస్తానని చెప్పారు.