కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణప్రతినిధి) : కరోనా సెకండ్వేవ్ అత్యంత వేగంగా విజృంభిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో భయానకంగా విస్తరిస్తున్నది. నాలుగు జిల్లాల్లో రోజుకు 500 నుంచి 600 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అందులో జగిత్యాల ప్రథమ స్థానంలో ఉండగా.. కరీంనగర్ రెండో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టడికి బహుముఖ యుద్ధం చేస్తున్నారు. గతంతో పోలిస్తే కొవిడ్ నిర్ధారణ కేంద్రాలను పెంచి, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులను విస్తృతం చేశారు. ప్రతి రోజు 3 వేల పైచిలుకు నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో బయట పడుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని.. టీకా వేసే కేంద్రాలతోపాటు వాటి పరిధిలో వ్యాక్సినేషన్ సెంటర్ల సంఖ్యను పెంచారు. వారం క్రితం వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు 2500 నుంచి 3 వేల వరకు వ్యాక్సిన్లు ఇవ్వగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9,500 దాటుతున్నది. కరీంనగర్ జిల్లాలో ఒక్కో రోజు సుమారు 5వేలు దాటుతుండగా, అంతటా వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.
490 పడకలతో కొవిడ్ కేర్ కేంద్రాలు..
ఓవైపు వ్యాక్సినేషన్, టెస్టుల ప్రక్రియను కొనసాగిస్తున్న అధికారులు.. మరోవైపు ప్రభుత్వ దవాఖానల్లో మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ చికిత్స కోసం 180 బెడ్స్ ఉండగా, వాటిని ప్రస్తుతం 272కి పెంచారు. ప్రస్తుతం 144 పడకలకు లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యం ఉండగా, 200 బెడ్లకు పెంచారు. ఆక్సిజన్ జనరేషన్ యూనిట్ మూడు నాలుగు రోజుల్లో అందుబాటులోకి రానున్నది. ఆర్టీపీసీఆర్ నిర్ధారణ పరీక్ష యూనిట్ కూడా మూడు నాలుగు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. దీంతో శాంపిల్స్ను హైదరాబాద్ పంపే ఇబ్బందులు తప్పుతాయి. అలాగే ప్రభుత్వ అనుమతితో 20 పడకల సౌకర్యం ఉన్న అన్ని ప్రైవేట్ దవాఖానలకు కొవిడ్ చికిత్స అందించే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 175 ప్రైవేట్ హాస్పిటళ్లకు కొవిడ్ చికిత్స అందించే అవకాశం ఏర్పడింది. అందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోనే 114 ప్రైవేట్ దవాఖానాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి కరీంనగర్ జిల్లాలోనే 3వేల పైచిలుకు బెడ్స్ సౌకర్యం ఉన్నది. అంతేకాదు, అవసరాన్ని బట్టి రెండు మెడికల్ కళాశాల్లోని బెడ్స్ను కూడా స్వాధీనం చేసుకొని చికిత్స అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే.. ఇప్పటివరకు 4వేల పైచిలుకు బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే పాజిటివ్ రోగుల్లో కొంత మంది హోం ఐసొలేషన్లో ఉండేందుకు వీలుండడం లేదు. సాధారణంగా అద్దె ఇండ్లల్లో ఉండేవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లాలో 490 బెడ్స్ సౌకర్యంతో కొవిడ్కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి.. రోగులకు అన్ని రకాల వైద్య సేవలతోపాటు భోజన వసతులు కల్పిస్తున్నారు. మరోవైపు ప్రభు త్వం తీసుకున్న కర్ఫ్యూను పకడ్బందీగా అమలుచేస్తున్న అధికారులు.. కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు.