భక్తుల కొంగుబంగారం లక్ష్మీనరసింహస్వామి
రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నిత్య పూజలతో పెరుగుతున్న భక్తుల తాకిడి
రేగొండ, మార్చి 21:మహిమాన్విత క్షేత్రం కొడవటంచ. భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా నిత్య పూజలందుకుంటున్నాడు రేగొండ మండలంలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి. భక్తుల హృదయాల్లో కొలువైన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రేగొండ మండల కేంద్రానికి 9 కిలోమీటర్లు దూరాన కొడవటంచ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ నెల 23 నుంచి 30 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూజారులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. 23న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా 24న స్వామివారి కల్యాణం, 25న గజవాహన సేవ, 26న సింహవాహన సేవ, 27న హనుమంతు సేవ, 28న బోనాలు తిరుగుట, పెద్ద రథోత్సవం, 29న మొక్కుల చెల్లింపులు, 30న అభిషేకం, నాగబలితో జాతర ముగుస్తుందని అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు.
స్వామి వారి చరిత్ర
పూర్వం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల వంశీయుడు తూపురాణి రంగాచార్యులు ఈ ఆలయా న్ని వెలుగులోకి తీసుకొచ్చారు. రంగాచార్యులు ఒకరోజు ఆలయ ప్రాంతంలోని చేదబావిలో నీరు తోడుతుండగా అందులో లక్ష్మీనరసింహస్వామి ప్రతిమ దొరికింది. తర్వాత ఆయనకు స్వామివారు కలలో కనిపించి, తాను చేదబావి సమీపంలో శిలావిగ్రహం రూపంలో వెలిసినట్లు చెబుతాడు. రంగాచార్యులు ఆ ప్రాంతంలో ఎంత వెతికినా స్వామివారి ప్రతిమ కనిపించలేదు. మళ్లీ ఓ రోజు కలలోకి వచ్చి తాను పుట్టలో నిక్షిప్తమై ఉన్నానని ఆనవాళ్లు చెప్పినట్లు భక్తులు చెబుతారు. దీంతో పుట్ట వద్ద వెళ్లి కొడవలి సహాయంతో పెకిలించగా, స్వామి వారి విగ్రహం బయపడింది. విగ్రహం తాకడంతో కొడవలి వంగిపోయింది. అలా అప్పటినుంచి కొడవలిని వంచిన స్వామిపేర కొడవటంచ క్షేత్రంగా పిలువబడుతున్నది. స్వామి వారు ఉన్న ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. మానసిక వ్యాధులతో బాధపడే వారు స్వామివారిని కొలిస్తే వ్యాధులు మటుమాయమవుతాయని భక్తుల నమ్మకం. సంతానం లేని వారు 40 రోజులపాటు ఉదయం, సాయంత్రం స్వామివారిని దర్శించుకొని సాంబ్రాని పొగ వేసుకుంటే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. ప్రస్తుతం నిత్య పూజలతో కొడవటంచ క్షేత్రం కళకళలాడుతున్నది.
భక్తులకు సకల సౌకర్యాలు
జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం. క్యూలైన్లు ఏర్పాటు చేశాం. పారిశుధ్య నిర్వహణ కోసం సిబ్బందిని నియమించాం. స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు నిర్మించాం. రూ.75 లక్షలతో నూతన కల్యాణ మండపం, కోటి రూపాయలతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టాం. జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి. – ఇంగె మహేందర్, ఆలయ చైర్మన్