గోల్డెన్ ట్రయాంగిల్.. ‘కోకాపేట – శంకర్పల్లి – ముత్తంగి’ని కలుపుతూ వచ్చే ప్రాంతం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడిదో సంచలనం. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులకు స్వర్గధామం. ఐటీ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డు, భారీ పరిశ్రమలు..
ఈ ప్రాంతానికి సరికొత్త క్రేజ్ను తీసుకొచ్చాయి. రియల్ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. దీంతో.. భవిష్యత్ అంతా ఈ ‘గోల్డెన్ ట్రయాంగిల్దే’ అని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవైపు ఐటీ కారిడార్. మరోవైపు ముంబై జాతీయ రహదారి. ఇంకోవైపు శంకర్పల్లి హైవే. వీటన్నిటినీ కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు.. ఇవన్నీ కలిసి ఏర్పడిందే గోల్డెన్ ట్రయాంగిల్. అభివృద్ధి పరుగులు పెడుతున్న ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెట్టు
బడులు ఎంతో అనుకూలంగా ఉన్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు.
కోకాపేట కేంద్రంగా..
హైదరాబాద్ ఐటీ పరిశ్రమ.. మాదాపూర్లోని
హైటెక్సిటీ నుంచి మొదలై రాయదుర్గం, కొండాపూర్, నానక్రాంగూడ మీదుగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకూ.. అక్కడినుంచి కోకాపేట వరకూ విస్తరించింది. ప్రస్తుతం హైదరాబాద్లోనే అత్యంత ఎత్తయిన (30 నుంచి 57 అంతస్తుల) భవనాలు కోకాపేటలోనే నిర్మితమవుతున్నాయి. వీటితోపాటు తాజాగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సుమారు 529 ఎకరాల్లో దేశంలోనే అత్యున్నతమైన మౌలిక సదుపాయాలతో ‘కోకాపేట నియోపోలిస్ లే అవుట్’ను అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడినుంచే గోల్డెన్ ట్రయాంగిల్ ప్రారంభమవుతున్నది. దీని పరిధి గండిపేట – శంకర్పల్లి మీదుగా బీడీఎల్ భానూరు నుంచి పటాన్
చెరువు – ముత్తంగి వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజ్ వరకు.. అక్కడి నుంచి తెల్లాపూర్, కొల్లూరు మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మళ్లీ కోకాపేటకు చేరుకుంటుంది. ఇదంతా ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల ఉన్న ప్రాంతమే. అయితే, కోకాపేటకు మరోవైపు గండిపేట చెరువు ఉండటం.. అక్కడ జీవో 111 అమలులో ఉండటంతో గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలోనే భవిష్యత్ అభివృద్ధికి అవకాశం ఉంటుందని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టే.. 2018లో కొల్లూరులో ఎకరం ధర రూ.3.5 కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.12 నుంచి రూ.14 కోట్ల దాకా పలుకుతున్నది. అదే కోకాపేటలో ఎకరం ధర ఇంచుమించు రూ.40 కోట్లకు పైగానే ఉన్నది.
అభివృద్ధి పరుగులు..
గోల్డెన్ ట్రయాంగిల్గా అభివర్ణిస్తున్న ‘కోకాపేట – శంకర్పల్లి – ముత్తంగి’ ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి పరుగులు పెడుతున్నది. రూ.1000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు, ఈ ప్రాంతంలోని కొండకల్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 15వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కొల్లూరులోనే కొలువుదీరాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీ పరిశ్రమలకు తోడు భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచే హైదరాబాద్ – ముంబై రైల్వే మార్గం వెళ్తుండగా.. స్థానికంగా ఉన్న ఈదులనాగులపల్లి రైల్వేస్టేషన్ను భవిష్యత్తులో శాటిలైట్ రైల్వే టర్మినల్ స్టేషన్గా తీర్చిదిద్దనున్నారు. ఇక కోకాపేటలోనూ ఐటీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడి నుంచి శంకర్పల్లి, ముత్తంగి ప్రాంతాలను 15 నిమిషాల్లోనే చేరుకునేలా మెరుగైన రవాణా సౌకర్యం ఉన్నది. ఇలా, అభివృద్ధికి కేంద్రమైన
‘గోల్డెన్ ట్రయాంగిల్’ను రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు స్వర్గధామంగా భావిస్తున్నారు వ్యాపారులు.
బరిగెల శేఖర్