పొలాలకు జడ్పీ నిధుల నుంచి రోడ్లు వేయిస్తున్నాం : జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి
పరిగి, డిసెంబర్ 21 : ‘ధాన్యం కొనుగోలులో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును రైతులకు వివరించండి.. వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలి.. కంది, వేరుశనగ సాగుపై దృష్టిని కేంద్రీకరించడంతో పాటు ఆయిల్పామ్ సాగుకు ప్రత్యేక చొరవ చూపండి’ అని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అధ్యక్షతన డీపీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు వేదికల వద్ద పంటల మద్దతు ధర తెలిపే జాబితాను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ తరగతుల నిర్వహణకు రెండేండ్లకు సంబంధించి రూ.4 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. నిర్మాణాలు పూర్తికాని రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు జడ్పీ నిధులతో రోడ్లను వేయిస్తున్నామన్నారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పలు విషయాలపై చర్చించారు.
కేంద్రం వడ్లు కొనబోమని చెప్పినందున రైతులు ఇతర పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి అధ్యక్షతన మంగళవారం డీపీఆర్సీ భవనంలో వికారాబాద్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేలా ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. డ్యూ డేట్ వచ్చిన వారందరికీ వ్యాక్సిన్ వేయించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని తెలిపారు. వానకాలం ధాన్యానికి సంబంధించి 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం చెప్పిందని, ఇప్పటివరకు రాష్ట్రంలో 55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, 30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పొలాల్లో ఉందన్నారు. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. రైతులు కంది, వేరుశనగ సాగుపై దృష్టి కేంద్రీకరించేలా చూడాలన్నారు. చెరువుల కింద తప్పనిసరిగా ఎవరైనా వరి సాగు చేస్తే సన్న రకాలు వేయాలని, వాటికి డిమాండ్ ఉందన్నారు. ఈ రైతులు సైతం రైస్మిల్లర్లు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంటేనే వరి వేయాల్సిందిగా మంత్రి చెప్పారు.
రైతు బంధుపై బ్యాంకర్లతో సమావేశం
రైతు బంధు డబ్బులు ఖాతాల్లో జమ చేయగా బ్యాంకర్లు రుణాల కింద పట్టుకుంటున్నారని తెలిసిందని, ఈ విషయంలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిందిగా మంత్రి సూచించారు. రైతు వేదికల్లో వివిధ పంటలకు సంబంధించిన మద్దతు ధరల పట్టికలు ఏర్పాటు చేయించాలని జిల్లా వ్యవసాయాధికారిని మంత్రి ఆదేశించారు. అవగాహన సదస్సులకు ఎంపీపీ, జడ్పీటీసీలను ఆహ్వానించాలన్నారు. అన్ని శాఖల అధికారులు ఆయిల్పామ్ పంట సాగుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. జనవరి మొదటి వారంలో సర్పంచ్లతో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. అటవీ ప్రాంతం నుంచి రోడ్లకు సంబంధించిన క్లియరెన్స్లపై త్వరలోనే ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఈఈలు, అటవీ శాఖ జిల్లా అధికారి, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దవాఖానల సలహా సంఘాల సమావేశాలు నిర్వహించరాదని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని, నిబంధనల ప్రకారం సమావేశాలు జరుపాలని, ఈ సమావేశాలకు తాను స్వయంగా హాజరవుతానని మంత్రి పేర్కొన్నారు.
శిథిలమైన భవనాలను తొలగించాలి
పాఠశాలల్లో పూర్తిగా శిథిలమైన భవనాల తొలగింపునకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతుల నిర్వహణకు సంబంధించి రెండేండ్లలో 4వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈసారి 2వేల కోట్ల ఖర్చుకు సంబంధించి వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల జిల్లా పరిషత్లకు వచ్చిన నిధుల్లో 50శాతం, ఏసీడీపీ నిధుల్లో కొంత శాతం పాఠశాలలకు కేటాయించాలన్నారు. పాఠశాలల్లో ఉపయోగంలో లేని మరుగుదొడ్లను తొలగించి కొత్తగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయుల బదిలీపై జోనల్ సర్దుబాట్ల తర్వాత రేషనలైజేషన్ చేస్తామని మంత్రి చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలకు సంబంధించి ప్రతీది రాజకీయ కోణంలో చూడరాదన్నారు. పదో తరగతి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యా శాఖాధికారికి మంత్రి సూచించారు. రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లతో ఇబ్బంది ఉంటే వెంటనే సమస్య పరిష్కరించి రోడ్డు పనులు జరిగేలా చూడాలని ఆర్అండ్బీ అధికారులను మంత్రి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వారానికి కనీసం రెండు రోజులు కలెక్టరేట్లో అందుబాటులో ఉండాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగేందర్గౌడ్ పేర్కొన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం నెలకు ఒకసారి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ తాను కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, జిల్లా పరిషత్ సీఈవో జానకీరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.