శంషాబాద్ : యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏది లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్ధేశ్యం చేశారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ పరిధిలోని హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్టు చాప్టర్కు విచ్చేసిన ఆయన ట్రస్టులోని శిక్షార్థులతో సమావేశమై మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో చిన్నపని అంటూ ఏది ఉండదని సూచించారు.
చదివిన చదువు కేవలం ఉపాధి కే కాదని, వ్యక్తి వివకాసం, విజ్ఞానంతో రాణించేవిధంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు తము సంపాదించిన దానిలో కొంత సమాజానికి సమర్పించాలని వివరించారు. ప్రతి విద్యార్థి మాతృభాషలో ప్రావీణ్యత పొందడంతో పాటు సోదరభాషలలో కూడ నైపుణ్యం సాధించడం ఎంతైన అవసరమన్నారు.
కరోన మహమ్మారి మనకు ఎన్నో జీవనసూత్రాలను తెలిపిందన్నారు.ఆహారనియమాలు, శారీరక పరిరక్షణ, సమాజంలో జీనవ ప్రక్రియతో పాటు భారతీయతత్వాన్ని అలవరుచుకునే విధంగా చేసిందని పేర్కొన్నారు.