సిద్దిపేట, డిసెంబర్ 15 : ప్రజారోగ్యంపై జిల్లా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. అందరికీ టీకాలే లక్ష్యంగా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో డీఎంహెచ్వో మనోహర్, జిల్లా వైద్య నోడల్ అధికారి కాశీనాథ్, టీవీవీపీ ఈఈ శ్రీనివాస్, డీఈ విశ్వ ప్రసాద్, వైద్య అధికార సిబ్బందితో కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. కరోనా వ్యాక్సినేషన్లో సిద్దిపేట జిల్లా రికార్డు సృష్టించిందన్నారు. మంగళవారం నాటికి జిల్లా ప్రజలందరికీ వంద శాతం ప్రజలకు మొదటి డోస్ ఇవ్వడం పూర్తయ్యిందన్నారు. పట్టణంలో హోటళ్లు, టీ స్టాళ్లు, దుకాణాలు, పాన్షాప్ల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేసుకోని వారికి వేయాలన్నారు. రోడ్డుపై ఆటోలు, ఇతర వాహనాలను ఆపి వ్యాక్సిన్ వేయించాలని, బస్టాండ్లలో రైతుబజార్, సమీకృత మార్కెట్లలో, ప్రధాన కూడలి, వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో అధికారులు ముమ్మరంగా తిరిగి వ్యాక్సిన్ వేయించాలని దిశానిర్దేశం చేశారు. బస్టాండ్లో బస్సు ఎక్కి ప్రయాణికుల నుంచి టీకా వివరాలు అడిగి తెలుసుకొని, టీకా వేసుకోని వారికి బస్సుల్లోనే ఇవ్వాలని సూచించారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా 100 శాతం వ్యాక్సిన్ పూర్తి చేయడానికి అధికారులు శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వ్యాక్సినేషన్ చేయించాలని సూచిస్తూ.. కేసీఆర్నగర్లో శాంపిల్స్ సేకరించే ప్రక్రియ ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానీ, మరమ్మతులకు గురైన ఏఎన్ఎం సబ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత అధికారులు పీఆర్, డీఎంహెచ్వోలతో సమీక్షించి, యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావును మంత్రి ఫోన్లో ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్లో కావాల్సిన సౌకర్యాల గురించి సాధ్యాసాధ్యాలపై చర్చించి అవసరమైన సిబ్బంది కేటాయింపుపై సూచనలు చేశారు.
డ్రైవ్ చేపట్టాలి
అందరికీ టీకాలే లక్ష్యంగా స్పెషల్ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని జిల్లా డీఎంహెచ్వో మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రధానంగా జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ, గ్రామాల్లో పంచాయతీలతో కలిసి ఉమ్మడిగా ఈ ప్రక్రియను చేపట్టాలని, విస్తృతంగా జరగనున్న ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన అందరికీ వ్యాక్సిన్ అందజేయడం సులువవుతుందని వైద్యాధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు. నిత్యం పది వేల మంది ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే బస్టాండ్ నిర్మాణం మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఫోన్ లైన్లో మంత్రి ఆదేశించారు. అంతకుముందు మెడికల్ కళాశాల-జిల్లా ఏరియా దవాఖానకు ప్రతిపాదించిన రేడియాలజీ, డ్రైనేజీ పనులపై వైద్యాధికారులను ఆరా తీశారు. సమీక్షలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.