మన్సూరాబాద్ : కరోనా సృష్టించిన కల్లోలంతో జీవనోపాధి కోల్పోయిన ఎంతో మందికి ‘ప్రాజెక్ట్ ప్రిషా’ ద్వార ఉపాధి కల్పించి చేయూతనిచ్చామని రైస్ ఏటీఎం ఫౌండర్, సామాజిక కార్యకర్త దోసపాటి రాము తెలిపారు.
‘ప్రాజెక్ట్ ప్రిషా’ సంస్థను నెలకొల్పి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం నాగోల్ డివిజన్ రాక్హిల్స్కాలనీలోని రైస్ ఏటీఎం వద్ద ప్రాజెక్ట్ ప్రిషా కోఆర్డినేటర్ యశస్విని జొన్నలగడ్డతో కలిసి దోసపాటి రాము విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దోసపాటి రాము మాట్లాడుతూ నిత్యావసర సరుకులు అందజేయడం ద్వార ఇబ్బందులు తొలగించడం కష్టం అని గ్రహించి ప్రాజెక్ట్ ప్రిషా ద్వార ఇప్పటికి 982 మందికి ఇడ్లీ బండీలు, కొబ్బరి బొండాల షాపులు, పిండి గిర్నీలు, ఇస్త్రీ షాపులు, టీస్టాల్స్, టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేయించామని తెలిపారు.
వెయ్యి కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో యశస్విని జొన్నలగడ్డ ఆలోచన మేరకు ప్రాజెక్ట్ ప్రిషాను ప్రారంభించామని.. మరో పద్దెనిమిది మందికి త్వరలో ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు.
స్నేహితుల ప్రోత్సాహం, సహకారం తీసుకుని ప్రాజెక్ట్ ప్రిషా కోఆర్డినేటర్ యశస్విని జొన్నలగడ్డ అందించిన చేయూతతో కరోనా బారినపడి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.