కవాడిగూడ: చెట్లను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మహాత్మాగాంధీ రూరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ ప్రసన్నకుమార్, రామకృష్ణామఠం స్వామి శితికంఠానందలు అన్నారు. ఈ మేరకు ఆదివారం దోమలగూడ లోయర్ ట్యాంక్బండ్లోని రామకృష్ణా మఠంలో ఇన్షియేటీవ్ ఫర్ మోరల్ కల్చర్ ట్రైనింగ్ పౌండేషన్ (ఐఎంసీటీఎఫ్), హెచ్ఎస్ఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రకృతి వందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ప్రసన్నకుమార్, శితికంఠానందలు మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షతః అనే నినాదానికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ చెట్లను, పర్యావరణాన్ని పరిరక్షించాలని వారన్నారు. పూర్వీకులు మనకు ఎలాంటి వాతావరణం, ప్రకృతిని ఇచ్చారో భవిష్యత్తు తరాలకు మనం అలాంటి సౌకర్యాన్ని ఇవ్వాలని వారు అన్నారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రామకృష్ణా మఠంలో ప్రతియేటా ప్రకృతి వందనం పేరుతో కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎంసీటీఎఫ్ అధ్యక్షుడు వినోద్, కన్వీనర్ శ్రీకాంత్రెడ్డి, హెచ్ఎస్ఎస్ఎఫ్ కన్వీనర్ చంద్రశేఖర్, కార్యదర్శి రాంమూర్తి, కో-కన్వీనర్లు డాక్టర్ శ్రావణ్కుమార్, రాంరెడ్డి, సభ్యులు సురేయేష్, పద్మజ, పాత్రికేయులు లక్ష్మణ్ యాదవ్తో పాలు పర్యావరణ ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.