శంషాబాద్ రూరల్ : మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టు ఉత్తర భాగంలో డ్రోన్లు సంచరించినట్లు ఎయిర్పోర్టు సేక్యూరిటీ అధికారులు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్జీఐఏ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
కాగా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సంచారాన్ని నిషేధించిన దరిమిలా వాటి సంచారం కలకలం రేపింది. అయితే సంచారం నిజమా కాదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక వేళ నిజమే అని తేలితే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హై అలర్ట్ ప్రకటించలేదు
మంగళవారం రాత్రి సమయంలో ఎయిర్పోర్టుకు ఉత్తరం వైపున మామిడిపల్లి వైపు డ్రోన్ లు సంచారించి నట్లు భద్రత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించినట్లు ఓ దినపత్రిక (నమస్తే తెలంగాణ కాదు) లో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని జీఎంఆర్ ప్రతినిధులు గురువారం మీడియాకు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.