వనపర్తిలో సాగయ్యే వేరుశనగకు నాణ్యమైనదిగా పేరుంది. అందుకే ఇక్కడ పండే పల్లీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నది. ఆఫ్లోటాక్సిన్ లేని పంట కావడంతో బహిరంగ మార్కెట్లలో భలే డిమాండ్ ఉన్నది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. అందుకే దేశం నలుమూలల నుంచి వర్తకులు వచ్చి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ముంబయి, గుజరాత్ రాష్ర్టాల వ్యాపారులు ఇక్కడి బుడ్డలను కొని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. యూరప్, అమెరికాతోపాటు పలు దేశాలకు ఖండాంతరాలు దాటి మన పల్లీ రవాణా జరుగుతున్నది. ఈ ఏడాది పండిన పంట క్వింటాకు మార్కెట్లో శనివారం గరిష్ఠంగా రూ.7,991 ధర లభిస్తున్నది. రైతులకు సిరులు కురిపిస్తుండడంతో సంతోషం
వనపర్తి, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో వేరుశనగ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి పంటలో ఆఫ్లోటాక్సిన్ (శిలీంధ్రం) లేకపోవడంతో దేశ నలుమూలల నుంచి వర్తకులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. నాణ్యత ఎక్కువగా ఉండడంతో ముంబై, గుజరాత్ ప్రాంత వ్యాపారులు ఇక్కడి వేరుశనగను కొనుగోలు చేసి ఆయా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఉత్తర భారతంలోని ముఖ్య పట్టణాలకు వేరుశనగను తీసుకెళ్లి అక్కడి నుంచి ట్రేడర్లు విమాన, సముద్ర మార్గాల ద్వారా అమెరికా, యూరప్దేశాలకు ఎగుమతి చేస్తారు. అక్కడి ట్రేడర్లు వాటిని ప్రాసెసింగ్ చేసి బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు పంపిస్తారు. వనపర్తిలో ప్రాసెసింగ్ యూనిట్లు నడుస్తున్నాయి. గ్రేడింగ్ చేయగా వచ్చిన అతి తక్కువ నాణ్యత ఉన్న తాలు రకం వేరుశనగను కూడా కొనుగోలు చేస్తారు. ఇక్కడి పల్లి నుంచి అధికంగా నూనె వస్తుంది. ఈ నూనె తినడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరవు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏటా యాసంగిలో లక్ష ఎకరాలకు పైగా వేరుశనగ సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లాలోనే ఏకంగా సుమారు 50 వేల ఎకరాలకు పైగా పండిస్తున్నట్లు అంచనా.ఇదిలా ఉండగా, వనపర్తి మార్కెట్ యార్డులో క్వింటా వేరుశనగకు శనివారం గరిష్ఠంగా రూ.7,991 పలికింది. ఈ సీజన్లో ఇదే అధికం అయినప్పటికీ. ఇంకా అధిక ధర పలికే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు.
పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అడుగులు..
పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు జాతీయ పరిశోధన కేంద్రం ఆమోదం తెలిపింది. 25 ఎకరాల స్థలాన్ని ఇందుకోసం కేటాయించారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో పరిశోధన కేంద్రానికి కూడా శంకుస్థాపన చేసేందుకు మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. గ్రేడింగ్ చేసిన వేరుశనగను నాలుగు భాగాలుగా విభజించి.. మొదటి రకాన్ని విత్తనాలకు, ఇతర రకాలను వేరుశనగ ఉప ఉత్పత్తులకు వాడనున్నారు. అంతేకాకుండా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నది. నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వచ్చి వేరుశనగకు మరింత ధర పలికే అవకాశం ఉంటుంది.
అధిక దిగుబడి వస్తుంది..
జిల్లాలో వేరుశనగ దిగుబ డి ఆశాజనకంగా ఉన్నది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటా ళ్ల దిగుబడి వస్తున్నది. వరితో పోలిస్తే వేరుశనగతోనే ఎక్కు వ లాభం. కేవలం వరిపై కా కుండా ఆరుతడి పంటల సా గుపై రైతులు దృష్టి సారించా లి. యాసంగిలో మినుము లు తదితర పంటలు వేయడం ద్వారా లాభసాటి వ్యవసాయం చేయొచ్చు. సుమారు 50 వేల ఎకరాల్లో వేరుశనగ పండిస్తున్నారు.
వరి సాగుతో లాభం లేదు..
వరి సాగు చేయడం వల్ల పెద్దగా లాభం లేదు. వడ్లు అందరూ పండిస్తున్నారు. అందుకే నేను వేరుశనగ వేశాను. అధిక దిగుబడి వస్తుంది. వరితో పోలిస్తే వేరుశనగతోనే అధిక లాభం వస్తుంది. పైగా పెట్టుబడి, కష్టం కూడా తక్కువ. వరితో ఎకరాకు రూ.20 వేలు మాత్రమే లాభం వస్తుంది. వేరుశనగకు రెండింతలు వచ్చే అవకాశం ఉంది.