మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 3 : ఉమ్మడి జిల్లాలోని 15-18 ఏండ్లలోపు పిల్లలకు సోమవారం కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మొదటిరోజు విద్యార్థులు ఉత్సాహంగా తరలివచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. 15-18ఏండ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలో 1,715మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి రఫీక్ తెలిపారు. జిల్లా జనరల్ దవాఖానతోపాటు 24 పీహెచ్సీల్లో ఉదయం 10నుంచి రాత్రి 8గంటలవరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
గద్వాల జిల్లాలో 698మందికి..
గద్వాలటౌన్, జనవరి 3 : జోగుళాంబ గద్వాల జిల్లాలో 698మంది పిల్లలకు టీకా వేశారు. 15-18 ఏండ్ల వయస్సు ఉన్నవారికి వ్యాక్సిన్ వేసేందుకు 15 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే అన్ని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్సెంటర్లు, సీహెచ్సీ, జిల్లా దవాఖానలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 46వేలమందికిపైగా అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించగా, మొదటిరోజు మొదటి డోస్ 698మందికి ఇచ్చారు. మంగళవారం నుంచి వ్యాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, జిల్లా దవాఖానలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ను డీఎంహెచ్వో శశికళ ప్రారంభించారు. అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించడంపై కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల హెచ్ఎంలతోపాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఐవో కిశోర్, ఆర్ఎంవో వృశాలిని, హెచ్ఈ మధుసూదన్రెడ్డి, సువేద, వరలక్ష్మి, శ్రీలత పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లాలో 1091మందికి..
నారాయణపేటటౌన్, జనవరి 3 : జిల్లావ్యాప్తంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా దవాఖానతోపాటు మొత్తం 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 15-18 ఏండ్లలోపు వారు మొత్తం 32,423మంది ఉన్నట్లు గుర్తించారు. మొదటి రోజు 1,091మంది వ్యాక్సిన్ వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాలను వైద్యాధికారులు పర్యవేక్షించారు. జిల్లా దవాఖానలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ హరిచందనతోపాటు డీఎంహెచ్వో రామ్మోనోహర్రావు, డీఐవో శైలజ, మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ పరిశీలించారు.
వనపర్తి జిల్లాలో 1,397మందికి..
వనపర్తి రూరల్, జనవరి 3 : జిల్లాలోని 15-18 ఏండ్లలోపు పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రా రంభమైంది. మొదటిరోజు 1,397మందికి మొ దటి డోసు వేసినట్లు డీఎంహెచ్వో చందూనాయక్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 27,929మంది ఉం డగా, 19 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వారందరికీ ఏడు రోజుల్లో టీకా వేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 188మందికి..
నాగర్కర్నూల్, జనవరి 3 : జిల్లావ్యాప్తంగా 40,126మంది టీనేజర్లను గుర్తించగా, మొదటి రోజు 188మందికి వ్యాక్సిన్ వేశారు. జిల్లా దవాఖానతోపాటు 26 పీహెచ్సీలు, 3 సీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ కొనసాగింది. వ్యాక్సిన్ తీసుకునే వారి వెంట తల్లిదండ్రులు తప్పనిసరిగా రావాల్సి ఉండడంతో మొదటిరోజు ఆశించినస్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సాయినాథ్రెడ్డి తెలిపారు. విద్యార్థులకు విద్యాసంస్థల యాజమాన్యాలు, హెచ్ఎంలు వ్యాక్సిన్ వేయించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.